Breaking News

ఢిల్లీకి థర్డ్ వేవ్ ముప్పు.. రోజుకు 45 వేల కేసులు? ఐఐటీ సంచలన నివేదిక


ఏప్రిల్‌లో దేశ‌రాజధాని ఢిల్లీని వణికించి కరోనా మహమ్మారి.. ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. లాక్‌డౌన్ విధించడంతో కేసులు తగ్గి క్రమంగా నగరం కోలుకుంటోంది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతున్నట్టు కనిపించినా.. మరోసారి ముప్పు తప్పదా? అంటే అవునంటోంది నివేదిక. మూడో దశ వ్యాప్తిపై ఐఐటి ఢిల్లీ నివేదిక భ‌యాందోళ‌న‌లకు గురిచేస్తోంది. మూడో దశలో ఢిల్లీలో సగటున రోజుకు 45 వేల‌కుపైగా కేసులు న‌మోద‌వుతాయ‌ని నివేదిక అంచనా వేసింది. అలాగే రోజూ దాదాపు తొమ్మిది వేల‌ మంది ఆసుపత్రిలో చేరే అవ‌కాశాలున్నాయని పేర్కొంది. రాబోయే విపత్కర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాల‌ని నివేదిక హెచ్చరించింది. ఢిల్లీలో అటువంటి పరిస్థితి ఎదురయితే నగరానికి ప్రతిరోజూ 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంద‌ని అంచ‌నా. ఈ సూచ‌న‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే కేజ్రీవాల్ సర్కారు స‌న్నాహాలు ప్రారంభించింది. ఆక్సిజన్ కొరతను అధిగమించేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా, నిర్వహణపై ఐఐటి ఢిల్లీ... కేజ్రీవాల్ స‌ర్కారు కలిసి పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల వ్యూహాత్మక సమస్యలను విశ్లేషించడం ద్వారా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఆక్సిజన్ పంపిణీపై ఐఐటి ఢిల్లీ బ్లూప్రింట్‌‌ను ఎప్పుడు అమలు చేస్తారో వివరించాలని గ‌తంలో హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేజ్రీవాల్ ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. ‘‘శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారితో పోరాటం చేస్తున్నాం.... చారిత్రక ఆధారాల ప్రకారం చివరిసారి మహమ్మారి 1920లో దాడిచేసింది. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు చాలా కాలం పడుతుంది. మీరు దానిని ముఖ్యమైనదిగా పరిగణించాలి. నిల్వ, రవాణా, బాష్పీభవనం చాలా విషయాలలో అప్రమత్తంగా ఉండాలి’’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మిత్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘‘ఢిల్లీలోని కరోనా సంక్షోభం సమయంలో ఆక్సిజన్ నిర్వహణకు ఐఐటీ ఢిల్లీ సూచనలు, సమీక్ష’’ పేరుతో నివేదికను అందజేసింది. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్‌ గణనీయమైన పెరుగుదలను ప్రభుత్వం పరిష్కరించుకోవాలి.. రెండో దశలో వ్యాప్తి 60 శాతం గరిష్ఠానికి చేరినప్పుడు ఉత్పత్తి, సరఫరాలో ఆలస్యం, అంతరాయాన్ని ఏర్పడిందని.. దీనిని నివారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ సంజయ్ ధిర్ నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది.


By May 30, 2021 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iit-warns-delhi-to-be-ready-for-worst-case-scenario-in-third-wave/articleshow/83082865.cms

No comments