Breaking News

విషాదం.. పిడుగుపాటుకు 18కిపైగా ఏనుగులు మృతి


పిడుగులు పడి కనీసం 18 ఏనుగులు మృత్యువాత పడిన ఘటన అసోంలో గురవారం వెలుగులోకి వచ్చింది. నగోవ్ జిల్లా బుముని హిల్స్ వద్ద 18 ఏనుగులు చనిపోయినట్టు గుర్తించారు. బుధవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన కురిసిన భారీ వర్షానికి గజరాజులు మృతిచెందినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందని అధికార వర్గాలు తెలిపారు. ఏనుగుల మృతికి గల కారణాలు, ఎన్ని చనిపోయాయనే దాని గురించి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నగోవ్ అటవీ డివిజన్ కథియాతోలి పరిధిలో కండోలి ప్రతిపాద రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఏనుగులు చనిపోయిన విషయం గురించి అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ‘‘ఏనుగుల మృతిపై స్థానిక గ్రామాల ప్రజలు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్నాం.. మేము వెళ్లేసరికి గజరాజులు విగతజీవులుగా పడి ఉన్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించాం’’ అని ఓ అటవీ శాఖ అధికారి తెలిపారు. అసోం అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (వైల్డ్‌లైఫ్) అమిత్ సహాయ్ మాట్లాడుతూ.. ‘‘ఏనుగులు చనిపోయిన ప్రదేశం చాలా మారుమూల ప్రాంతం కావడంతో తమ సిబ్బంది గురువారం మధ్యాహ్నానికి అక్కడకు చేరుకున్నారు.. ఏనుగులు మృతదేహాలు రెండు సమూహాలుగా పడి ఉన్నాయి.. 14 ఏనుగులు కొండపై పడి ఉండగా.. నాలుగు దిగువ భాగంలో గుర్తించారు’’ అని అన్నారు. ఈ ఘటనపై అసోం అటవీ, పర్యావరణ మంత్రి పరిమళ్ శుక్లాబడియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, ఇతర అటవీ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు, జంతు సంరక్షణ నిపుణులు అక్కడకు చేరుకుని ఏనుగుల మృతదేహాలను పరిశీలించారని అన్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీ మంత్రికి ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ఆదేశాలు జారీచేశారు.


By May 14, 2021 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/at-least-18-wild-elephants-killed-in-lightning-strike-in-assam/articleshow/82623063.cms

No comments