Breaking News

ఈ పరిస్థితుల్లో టీకా తీసుకున్నా భారత్‌కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా హెచ్చరిక


భారత్‌లో కోవిడ్ విలయతాండవం కొనసాగుతున్న నేపథ్యంలో తన పౌరులకు అమెరికా కీలక సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే వరకు భారత ప్రయాణాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి భారత పర్యటనను రద్దు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ, ప్రయాణం తప్పనిసరి అయితే మాత్రం ముందస్తుగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కోరింది. కోవిడ్ తీవ్రత అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్న దేశాల జాబితా లెవెల్-4లో భారత్ ఉందని సీడీసీ పేర్కొంది. ఒకవేళ పూర్తిస్థాయిలో టీకా వేసుకున్నా అక్కడ వ్యాప్తిలో ఉన్న కోవిడ్ వేరియంట్స్ వల్ల ముప్పు ఉందని తెలిపింది. ‘‘భారత పర్యటన అత్యవసరమైతే టీకా వేసుకోవాలని, మాస్క్ ధరించి ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి... జన సమ్మర్ధాలకు దూరంగా ఉండాలి.. చేతులను తరుచూ శుభ్రం చేసుకోవాలి’’ అని సూచించింది. మరోవైపు, బ్రిటన్ కూడా భారత్‌ను తన ట్రావెల్ ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. ఈ నెల 25న భారత పర్యటనకు రావాల్సిన ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మరో 2.56 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా, మరో 1,757 మంది బలయ్యారు. ఇదిలా ఉండగా, పెరుగుదలతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, ఔషధాల కొరత ఏర్పడుతోంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా సరిపడేన్ని డోస్‌లు అందుబాటులో లేవని పలు రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి. భారత్ కరోనా పరిస్థితుల దృష్ట్యా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దయ్యింది. ఏప్రిల్ 26న జాన్సన్ భారత్‌కు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపాలని తొలుత భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ పర్యటన క్షేమకరం కాదని ప్రతిపక్షాలు సహా ఇతర వర్గాలు సూచించడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు.


By April 20, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/avoid-india-travel-even-if-fully-vaccinated-us-advisory-their-citizens/articleshow/82157048.cms

No comments