Breaking News

బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన రద్దు.. ఇండియాను రెడ్ లిస్ట్‌లో పెట్టిన యూకే!


ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. అక్కడ కోవిడ్ విజృంభణతో భారత పర్యటన రద్దు చేసుకుని, ఏప్రిల్‌కు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, బ్రిటిష్‌ ప్రధాని భారత్‌ పర్యటన రద్దయ్యింది. భారత్ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఇరు దేశాల తరఫున బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ‘‘ఒకవేళ భారత్‌లో పరిస్థితి కుదుటపడి, కోవిడ్ నియంత్రణలోకి వస్తే జీ7 కూటమి సమావేశాలకు ముందే బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించవచ్చు.. ఇరువురి నేతల విర్చువల్ సమావేశం తర్వాత దీనిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది’’అని భారత్ దౌత్యాధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్ 26న జాన్సన్ భారత్‌కు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపాలని జాన్సన్‌ తొలుత భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ పర్యటన క్షేమకరం కాదని ప్రతిపక్షాలు సహా ఇతర వర్గాలు సూచించడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెలాఖరులో మోదీతో వర్చువల్‌ విధానంలో జాన్సన్ సమావేశమవుతారు. భారత్‌-బ్రిటన్‌ మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల మెరుగుదల కోసం ఉద్దేశించిన ‘రోడ్ మ్యాప్ 2030’పై ఇరువురు నేతలు చర్చిస్తారు. భారత పర్యటన రద్దుపై యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పర్యటన రద్దు బాధాకరమే అయినా, మంచి నిర్ణయమేనని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లోని ప్రస్తుత పరిస్థితిని చూసిన తరువాత పర్యటనను వాయిదా వేసుకోవడమే మంచిదని భావిస్తున్నా.. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ విపత్తును ఎదుర్కొంటున్నాయి.. అందరమూ భారత్‌కు సానుభూతి చూపిస్తున్నాం’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, దేశంలో కోవిడ్ ఉద్ధృతి పెరిగిన దృష్ట్యా భారత్‌ను రెడ్‌ లిస్ట్‌‌లో చేర్చినట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని పేర్కొన్నారు. తాజా నిర్ణయం ప్రకారం భారత్‌ నుంచి అన్ని రకాల ప్రయాణాలను నిషేధిస్తారు. అలాగే, ఇక్కడ నుంచి వెళ్లే బ్రిటన్‌, ఐరిష్ పౌరులు తప్పనిసరిగా పది రోజుల పాటు హోటల్ క్వారంటైన్‌లో ఉండాలి. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మంత్రి మాట్‌ మాట్లాడుతూ ‘‘దేశంలో భారత్‌ రకం కరోనా స్ట్రెయిన్ కేసులు 103 బయటపడ్డాయి.. ఇవన్నీ అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా నమోదయినవే.. ఈ వైరస్‌ జన్యు పరీక్షలు చేస్తున్నామని, ఇదేమైనా కొత్త తరహాదా? త్వరగా వ్యాపిస్తుందా? టీకాలకు లొంగదా? అనే విషయాలపై అధ్యయనం చేస్తున్నాం’’ అని వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కష్టమైనప్పటికీ...భారత్‌ను రెడ్ లిస్ట్‌లో పెట్టామని చెప్పారు. ‘‘భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఒక విదేశీ ప్రముఖుడి రాక కంటే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ట్యాంకులు, పీపీఈ కిట్లు కొరతపై దృష్టి పెట్టాలి’’అని బ్రిటన్‌కు చెందిన ఓ వ్యాపారి వ్యాఖ్యానించారు. ‘‘కోవిడ్ కేసులు పెరగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలనే ఆలోచన మంచిది కాదు.. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది’’ అని చురకలంటించారు.


By April 20, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/britan-pm-johnsons-india-visit-cancelled-and-uk-puts-india-on-travel-red-list-due-to-covid-surge/articleshow/82154821.cms

No comments