Breaking News

సార్ మనోళ్లు చాలా మంది చనిపోయారు.. కన్నీళ్లు పెట్టిస్తున్న చత్తీస్‌గఢ్ జవాన్ వీడియో


చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్యకు 24 మంది జవాన్లు బలయ్యారు. భద్రతా బలగాలను నక్సల్స్ ట్రాప్‌‌చేసి అత్యంత దారుణంగా హింసించి ప్రాణాలు తీశారు. దీనికి సంబంధించి ఓ జవాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్‌కౌంటర్ తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. గాయాలతో ఉన్న జవాన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తూ అటవీ ప్రాంతం నుంచి తరలించడానికి హెలికాప్టర్ కోసం వేచిచూస్తున్నారు. అనిల్ కుమార్ దూబే అనే సైనికుడు తమ ఉన్నతాధికారికి ఘటన గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాడు. ‘కౌశిక్ సర్... ఈ రోజు మన జవాన్లు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. నేను అనిల్ కుమార్ దూబే, మీ తమ్ముడు, మీ కుమారుడు, మీ పక్కంటి వ్యక్తి... చాలా మంది స్నేహితులను ఈరోజు కోల్పోయాం.. గాయపడి ప్రాణాలతో ఉన్నవారిని చికిత్స కోసం తీసుకెళ్తున్నారు’ అని వీడియోలో ఆ జవాన్ చెబుతున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లు దాడికి సిద్ధంగా లేకపోవడమే కాదు, నిఘా వైఫల్యం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. జాగరగుండ-జొనగుండ-తారెమ్ బెల్ట్‌ వద్ద మోస్ట్‌వాంటెడ్ మావోయిస్ట్ మడ్వి హిడ్మా సహా అగ్రనేతలు ఉన్నారనేది కేవలం పుకారు మాత్రమేనని, భద్రతా బలగాలను ట్రాప్ చేయడానికి నక్సల్స్ దీనిని సృష్టించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారికోసం గాలిస్తుండగా యూ ఆకారంలో మూడు వైపుల నుంచి 400 మంది మావోయిస్టులు భద్రత దళాలను చుట్టుముట్టి దాడిచేశాయి. ఈ హఠాత్మరిణామం నుంచి జవాన్లు తేరుకునేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. తుపాకులు, లాంచర్లు, మారణాయుధాలతో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జవాన్లు వారి దాడిని తిప్పికొట్టి ఎదురు నిలిచారు. వారితో ఐదు గంటలపాటు పోరాటం చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో 23 మంది జవాన్లు అమరులుకాగా.. మరో 30 మంది గాయపడ్డారు. అటు, 15 నుంచి 20 మంది వరకూ మావోయిస్టులు హతమైనట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, పోలీసుల వద్ద నుంచి రెండు డజన్లకుపైగా ఆయుధాలను నక్సల్స్ ఎత్తుకెళ్లారు.


By April 06, 2021 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-soldier-video-viral-in-social-media-who-in-chhattisgarh-maoist-attack/articleshow/81923971.cms

No comments