Breaking News

కరోనా ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం... ఐదుగురు మృతి!


కరోనా విలయానికి ఛత్తీస్‌గఢ్‌ చిగురుటాకులా వణుకుతోంది. కోవిడ్ బాధితులకు ఆస్పత్రులు సరిపడటంలేదు. మార్చురీల వద్ద మృతదేహాలు గుట్టలుగా పోగవుతున్నాయి. అంత్యక్రియలకు శ్మశానాలు సరిపడటం లేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఓ ఆస్పత్రిలో ఆగ్ని ప్రమాదం సంభవించి, ఐదుగురు మృతిచెందారు. ఈ దుర్ఘటన రాయపూర్ పచ్పెడీనాకా పరిధిలోని రాజధాని ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... మరికొందరు గాయపడ్డారు. ఈ ఆసుపత్రిలో కరోనా రోగులు కూడా చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయానికి సుమారు 50 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. మృతులలో ఒకరు అగ్నికి ఆహుతికాగా, మిగతా నలుగురు ఆక్సిజన్ సరఫరా అందక ఊపిరిడాక మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని, మిగతావారిని వేరే ఆస్పత్రికి తరలించామని పోలీస్ అధికారి తారకేశ్వర్ పటేల్ తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రమాదం నిర్లక్ష్యం కారణంగా జరిగిందని భావిస్తున్నామని, అందుకే ఆస్పత్రి యాజమాన్యంపై కేసు బుక్ చేశామన్నారు. ‘‘ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయివారు కోవిడ్ రోగులు.. వీరు కొద్ది రోజుల కిందటే ఆస్పత్రిలో చేరారు.. ఐసీయూలో ఫ్యాన్ షార్ట్ సర్క్యూట్ అయి మిగతా వార్డులకు మంటలు వ్యాపించాయి.. ప్రమాద సమయంలో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థను వినియోగించలేదు.. ఈ విషయంలో యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం’ అని రాయ్‌పూర్ ఎస్పీ అజయ్ యాదవ్ అన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేలా.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.


By April 18, 2021 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-killed-after-fire-broke-out-at-covid-19-hospital-in-chhattisgarh-raipur/articleshow/82125734.cms

No comments