Breaking News

ఓవైపు టీకా‌ల కొరత.. నేటి నుంచే టీకా మహోత్సవ్


కరోనా మహమ్మారి వ్యాప్తికి నిరోధించాలంటే టీకా ఒక్కటే సరైన మార్గమని, ప్రతి ఒక్కళ్లూ వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రాలు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా మహోత్సవాన్ని నిర్వహించాలని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మోదీ కోరారు. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం గ్రామీణ, పట్టణ పరిధిలోని పలు ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేసి, వ్యాక్సినేషన్‌ కేంద్రాలుగా గుర్తించారు. వీటి పరిధిలో వందశాతం టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, అధికారులు మహోత్సవానికి ఏర్పాట్లు చేసినా.. ప్రస్తుతానికి టీకా అందుబాటులో లేదు. అవి వచ్చిన వెంటనే వీటి పరిధిలో వేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. టీకా డోస్‌లు తక్కువ సంఖ్యలో ఉండటంతో తమ రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో పంపాలని పలు ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాశాయి. అయితే, శనివారం రాత్రి దాకా కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ సరఫరా కాలేదు. ఈ పరిస్థితుల్లో ఉత్సవాన్ని ఎలా నిర్వహించాలో తెలియని అధికారులు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా రెండో దశ కోరలు చాస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలే టీకా కొరతకు కారణమని విపక్షాలు ఆరోపించాయి. ‘దేశంలోని ప్రజానీకానికి టీకా అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత.. దేశ అవసరాలకు సరిపడా నిల్వ ఉంచుకొని, తర్వాత ఎగుమతులు చేయడం, బహుమతిగా ఇవ్వడం చేయాల్సింది.. కానీ మోదీ ప్రభుత్వం సరైన లెక్కలు వేయలేకపోయింది. టీకాలను ఎగుమతి చేసి.. దేశంలో వ్యాక్సిన్‌ కొరత సృష్టించింది’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు.


By April 11, 2021 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-vaccine-shortage-three-days-vaccine-mahotsav-begin-from-today/articleshow/82012609.cms

No comments