Breaking News

కోవిడ్ విశ్వరూపం.. భారత్ ప్రయాణాలపై న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం


దేశంలో మహమ్మారి విశ్వరూపం దాల్చింది. రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.26 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. రెండు వారాలుగా భారత్‌లో నమోదవుతున్న పాజిటివ్ కేసులతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ తాత్కాలికంగా నిషేధం విధించింది. అక్కడ గురువారం కొత్తగా 23 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. వీరిలో 17 మంది భారత్ నుంచి వచ్చినవారే ఉన్నారు. దీంతో భారత నుంచి వచ్చేవారికి తాత్కాలికంగా అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ‘భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు న్యూజిలాండ్‌లోకి తాత్కాలికంగా నిషేధం విధించాం’ అని ఆ దేశ ప్రధాని జెసిండ్ అర్డెర్న్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 28 వరకు ఇది అమల్లో ఉంటుందని, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘భారత్ నుంచి వచ్చినవారిలో కోవిడ్ కేసులు నమోదుతో ఈ ఆంక్షలను ప్రేరేపించినప్పటికీ మేము సాధారణంగా ముప్పును ఎలా తప్పించాలనే చూస్తున్నామని నొక్కిచెప్పాలనుకుంటున్నాను.. ఇది దేశ నిర్దిష్ట ప్రమాద అంచనా కాదు’ అని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై పోరులో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. మహమ్మారిని తన సరిహద్దుల నుంచి తరిమికొట్టడంతో సఫలమయ్యింది. గత 40 రోజుల నుంచి స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అయితే, విదేశాల నుంచి వచ్చినవారు ముఖ్యంగా భారతీయులు చాలా మంది వైరస్ బారినపడుతున్నారు. రోజువారీ సగటు కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, బుధవారం నాటికి పాజటివ్ కేసుల సగటు 7కి చేరిందని ప్రధాని జెసిండా తెలిపారు. గురువారం స్థానికుల్లో ఒకరు వైరస్ బారినపడ్డారు. కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి వైరస్ నిర్ధారణ అయ్యింది.


By April 08, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/new-zealand-stops-entry-of-travellers-from-india-amid-coronavirus-surge/articleshow/81964223.cms

No comments