Breaking News

రాష్ట్రాలకు కీలక గైడ్‌లైన్స్.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తేల్చేసిన కేంద్ర హోం శాఖ


దేశంలో వ్యాప్తికి ఇప్పట్లో అడ్డుకట్టపడే సూచనలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. కోవిడ్ కట్టడికి పలు రాష్ట్రాలు కరోనా కర్ఫ్యూలు, కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. మే 2 తర్వాత కేంద్రం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందనే ప్రచారం జోరుందుకుంది. అయితే, కేంద్ర హోం శాఖ తాజాగా వెల్లడించిన కోవిడ్ మార్గదర్శకాలతో అలాంటిదేం లేదని తేలిపోయింది. కరోనా కేసులు పెరుగుతున్నందున కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం శాఖ గురువారం సూచించింది. గతంలో వెలువరించిన మార్గదర్శకాలను మే 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. ‘‘ఏప్రిల్ 25న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహా ప్రకారం ఈ రోజు జారీచేసిన ఉత్తర్వుల్లో కంటెయిన్‌మెంట్ చర్యలను పరిగణనలోకి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుఆదేశిస్తున్నాం.. పరిస్థితిని అంచనా వేయడం ద్వారా తక్షణమే అమలు చేయాలి.. విపత్తు నిర్వహణ చట్టం- 2005 నిబంధనల ప్రకారం.. అవసరమైన నియంత్రణ చర్యలను అమలు చేయాలని రాష్ట్రాలు, యూటీలను కోరుతున్నాం’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. కేంద్ర హోంశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉన్న జిల్లాలను రాష్ట్రాలు గుర్తించాలి. అలాగే, 60 శాతం కంటే ఎక్కువ పడకలు నిండిన ప్రాంతాలను గుర్తించాలి.. ఏదైనా జిల్లాలో ఈ రెండు పరిస్థితులు ఉంటే జిల్లాలో స్థానిక నియంత్రణ చర్యలను చేపట్టాలి’’అని హోం మంత్రిత్వ శాఖ సూచించింది. కమ్యూనిటీ లేదా పెద్ద కంటెయిన్‌మెంట్ ప్రాంతాల అమలకు ఫ్రేమ్‌వర్క్ కూడా రూపొందించాలి. దేశంలో గడచిన 24 గంటల్లో 3.82 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మరో 3,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరుసగా మూడో రోజు కోవిడ్ మరణాలు మూడు వేలు దాటాయి. యాక్టివ్ కేసులు 31 లక్షలకు చేరుకున్నాయి.


By April 30, 2021 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mha-rules-out-national-lockdown-extended-guidelines-of-containment-measures-till-may-31/articleshow/82321769.cms

No comments