Breaking News

అట్టుడుకుతున్న పాక్.. ఏడుగురు మృతి, 600 మంది పోలీసులకు గాయాలు!


పాకిస్థాన్‌లో చెలరేగిన సామాజిక అశాంతి తారాస్థాయికి చేరింది. అతివాద, నిషేధిత ఇస్లామిక్‌ సంస్థ తెహ్రీక్‌-ఇ-లిబాయక్‌ పాకిస్థాన్‌ (టీఎల్‌పీ) నేత సాద్‌ హుస్సేన్ రిజ్వీ అరెస్ట్‌తో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకోవడంతో లాహోర్‌, కరాచీ, రావల్పిండిల్లో నిరసనలు హోరేత్తాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం హింస మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని భావించిన పాక్ ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సామాజిక మాధ్యమాలను నిషేధించింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌ సహా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించి, ఇంటర్నెట్‌ను సైతం నిలిపివేసింది. ఛాందసవాద ఇస్లామిక్‌ పార్టీ టీఎల్పీ.. 2018 పాక్‌ ఎన్నికల్లోనూ పోటీచేసింది. మత దూషణ ప్రపంచంలో ఎక్కడ జరిగినా పాక్‌లో ప్రదర్శనలను నిర్వహించడం టీఎల్పీ విధానం. మహమ్మద్‌ ప్రవక్తపై ఫ్రెంచి పత్రికల్లో కార్టూన్లు, ప్రవక్తను వ్యంగ్యంగా చిత్రీకరించడాన్ని టీఎల్‌పీ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, ఈ కార్టూన్లను భావప్రకటన స్వేచ్ఛగా పరగణించిన ఫ్రెంచి ప్రభుత్వం వాటిని సమర్థించడంతో టీఎల్‌పీ నిరసన సాగిస్తోంది. ప్రవక్త కార్టూన్‌లకు సంబంధించి ఓ ఫ్రెంచ్ టీచర్‌ను గతేడాది అత్యంత దారుణంగా తలనరికి హత్య చేసినప్పటి నుంచి ఈ వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. నెలరోజులుగా టీఎల్‌పీ ఉధృతం చేసింది. రిజ్వీ అరెస్ట్‌తో గురువారం నుంచి ఆ పార్టీ ప్రత్యక్ష హింసకు దిగింది. ఈ ఘటనల్లో నలుగురు పోలీసులు సహా ఏడుగురు ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. 600 మందికిపైగా గాయపడ్డారు. భారీ ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లే రహదారుల దిగ్బంధం, వేలాది మంది బైఠాయింపులు, ధర్నాలు, దాడులతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్రాన్స్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని, పాక్‌లోని ఫ్రెంచి వారందరినీ వెళ్లగొట్టాలని టీఎల్పీ డిమాండ్‌ చేస్తోంది. అయితే, ఇందుకు నిరాకరించిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం.. అలా చేస్తే పాక్‌ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. టీఎల్‌పీని శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దానిని ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి నిషేధం విధించింది. అయితే, ఓ రాజకీయ పార్టీని తీవ్రవాద సంస్థగా పరిగణించి నిషేధించడాన్ని పలు ఇస్లామిక్‌ గ్రూపులు నిరసిస్తూ ప్రదర్శనలు ప్రారంభించాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పాక్‌లోని తమ పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని ఫ్రాన్స్ కోరింది. రహదారులను దిగ్బంధించిన ఆందోళనకారుల్లో 3,200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎల్పీ మద్దతుదారుల ఆందోళనల్లో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, 600 మంది గాయపడ్డారని ప్రధాని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసే క్రమంలో హింసను ప్రేరేపిస్తోన్న మత ఛాందసవాదులను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో అమరులైన పోలీసులకు ప్రత్యేకంగా నివాళులు అర్పించాలని భావిస్తున్నాను... నలుగురు పోలీసులు అమరులు కాగా, 600 మందికిపైగా గాయపడ్డారు..మన దేశం ఈ వీరులకు రుణపడి ఉంది.. మేము అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


By April 17, 2021 at 12:10PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-suspends-services-of-social-media-after-anti-france-protest-violence/articleshow/82114128.cms

No comments