Breaking News

కశ్మీర్: ఎన్‌కౌంటర్‌లో 3 ఉగ్రవాదులు హతం.. 48 గంటల్లో 12 మందిని చంపిన సైన్యం


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేసిన సైన్యం.. ముష్కరమూకల భరతం పడుతోంది. కేవలం 48 గంటల్లోనే వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది తీవ్రవాదులను కాల్చి చంపారు. రెండు రోజుల కిందట షోపియాన్‌లో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా, షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు హతమయ్యారు. శనివారం రాత్రి ఒక ఉగ్రవాది హతమవ్వగా.. ఆదివారం తెల్లవారుజామున మరో ఇద్దర్ని కాల్చి చంపాయి. భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు కొనసాగాయి. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు శనివారం సాయంత్రం ఆపరేషన్‌ చేపట్టాయి. సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 10 గంటల పాటు భీకర కాల్పులు కొనసాగాయి. శనివారం రాత్రి ఓ ముష్కరుడు, ఆదివారం తెల్లవారుజామున మరో ఇద్దరు హతమయ్యారు. వీరిని అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరిన వ్యక్తిని లొంగిపోవాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అతడి తల్లిదండ్రులను తీసుకువచ్చి మరీ వెనక్కి రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతడిని మిగతా ఉగ్రవాదులు బయటకు రానివ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు, అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బిహారా వద్ద శనివారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా కొందరు ముష్కరులు హతమైనట్టు తెలుస్తోంది. దీని గురించి వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఐదుగురు ముష్కరుల్లో ఒకరు ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ నేత ఇంతియాజ్‌ షా ఉన్నట్లు పేర్కొన్నారు.


By April 11, 2021 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-killed-in-shopian-and-in-the-past-48-hours-12-terrorists-encounterd/articleshow/82013798.cms

No comments