Breaking News

మూడు రాత్రులు గడిపి.. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్: యువతికి షాక్ ఇచ్చిన కానిస్టేబుల్


ఐదేళ్లుగా ప్రేమించానని మాయమాటలు చెప్పాడు.. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకుందామని నమ్మించాడు. ఇది నిజమేనని నమ్మిన యువతి.. ఇంటి నుంచి వెళ్లిపోయి అతడిని పెళ్లిచేసుకుంది. మూడు రాత్రులు ఆమెతో గడిపిన తర్వాత డ్యూటీ పేరుతో వెళ్లిపోయి ముఖం చాటేశాడు. తర్వాత మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో తాను మోసపోయినట్టు బాధితురాలు గ్రహించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసకోటె తాలూకాలోని నందగుడికి గ్రామానికి చెందిన ప్రమోద్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాధితురాలు అనూజను ప్రేమించాడు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రమోద్, అనూజల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. కుటుంబాలను ఎదురించి రెండు నెలల కిందట యలహంక సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఇద్దరూ ఒక్కటయ్యారు. అనూజ మెడలో మూడు ముళ్లువేసిన ప్రమోద్ తన దానిని చేసుకున్నాడు. వివాహం కావడంతో మూడు రోజుల పాటు ఇద్దరూ కలిసున్నారు. ఆ తర్వాత ప్రమోద్ డ్యూటీ ఉందని బాధితురాలితో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నా ప్రమోద్ తిరిగి రాకపోవడం, ఎన్నిసార్లు ఫోన్‌చేసిన స్విచ్ఛాఫ్ రావడంతో అనూజకు అనుమానం వచ్చింది. దీంతో అతడి కోసం ఆరాతీసిన ఆమెకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ప్రమోద్‌ మరో పెళ్లికి సిద్ధమైనట్లు బాధితురాలు తెలుసుకుంది. దీంతో వెంటనే నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో రెండు రోజుల కిందట ధర్నాకు దిగింది. అతడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


By March 13, 2021 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-women-cheating-by-crpf-constable-after-falling-in-love-in-bengaluru/articleshow/81480190.cms

No comments