Breaking News

మహిళను అత్తింటిలో ఎవరు వేధించినా భర్తదే బాధ్యత.. సుప్రీం సంచలన తీర్పు


అత్తింటిలో మహిళల పట్ల వేధింపులపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తింటి తరఫు బంధువులు సహా ఎవరు వేధింపులకు గురిచేసినా భర్తే ప్రధాన బాధ్యుడని స్పష్టం చేసింది. భార్యను వేధింపులకు గురిచేసిన కేసులో భర్తకు ముందుస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం పైవిధంగా స్పందించింది. పంజాబ్‌కు చెందిన కుషాగ్ర మహాజన్‌కు మూడో వివాహం కాగా, ఆమెకు రెండోది. వీరికి 2017లో వివాహం జరగ్గా.. ఏడాది తర్వాత 2018లో బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గతేడాది జూన్‌లో బాధిత మహిళ లూధియానా పోలీసులకు భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మహాజన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరు ఎలాంటి మనిషి? ఆమెను గొంతుకోసం చంపబోయారని ఆరోపించింది.. గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేశారని ఆరోపించింది... మీ భార్యను కొట్టడానికి క్రికెట్ బ్యాట్‌ను ఉపయోగించారంటే మీరు ఎలాంటి వ్యక్తి?’’ అని తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా నిందితుడి తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. భర్త తండ్రి తనను క్రికెట్ బ్యాట్‌తో కొట్టారని ఆరోపించిందని అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘క్రికెట్ బ్యాట్‌తో భర్త లేదా అతడి తండ్రి కొట్టాడా? అనేది ఇక్కడ విషయం కాదు.. అత్తింటిలో వేధింపుల వల్ల మహిళకు గాయాలయితే ప్రాథమిక బాధ్యత భర్తపై ఉంటుంది’అని స్పష్టం చేసింది. అంతకు ముందు పంజాబ్ హరియాణా హైకోర్టు సైతం నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ‘గతేడాది జూన్ 20న రాత్రి 9 గంటలప్పుడు కుషాగ్ర మహాజన్, అతడి తండ్రి క్రికెట్ బ్యాట్‌తో దారుణంగా కొట్టారు.. ఇందులో ఆయన తల్లికూడా పాల్గొంది.. ముఖంపై దిండుతో అదిమి నన్ను చంపడానికి ప్రయత్నించారు.. అనంతరం జట్టుపట్టుకుని రోడ్డుమీదకు ఈడ్చుకొచ్చారు.. ఈ విషయం తెలిసిన తన తండ్రి, సోదరుడు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు’ అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె ఒంటిపై అనేక గాయాలున్నట్టు తేలింది. ముఖం, తల, మెడతోపాటు ఆమె రహస్య భాగాల్లోనూ గాయాలున్నట్టు నివేదిక పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నరరూప రాక్షసులకు ముందస్తు బెయిల్ నిరాకరించింది.


By March 09, 2021 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/husband-liable-for-womans-injuries-in-matrimonial-home-says-supreme-court/articleshow/81403503.cms

No comments