Breaking News

టీఎంసీ, బీజేపీల ఆడియో టేపుల కలకలం.. పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు


పశ్చిమ్ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. నందిగ్రామ్‌లో నేతకు ఫోన్‌ చేసి సహకరించాలని కోరినట్టు ఓ ఆడియోను కాషాయ పార్టీ విడుదల చేసింది. సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్‌ పాల్‌‌ తనకు దీదీ ఫోన్‌చేసి మద్దతు కోరారని తెలిపారు. మమతతో జరిగిన సంభాషణ ఆడియో టేపు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నందిగ్రామ్‌లో ఓటమి తప్పదనే మమత తమ పార్టీ నేతకు ఫోన్‌ చేశారని బీజేపీ ఫైర్‌ అయింది. మమతా బెనర్జీ తమ నేతలను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనికి కౌంటర్‌గా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ నేతల సంభాషణలకు సంబంధించిన ఆడియోలను బయటపెట్టింది. బీజేపీ సీనియర్ నేత ముకుల్ రాయ్, సిసిర్ బజోరియాల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఎన్నికల సంఘాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో వివరించినట్టు ఆరోపించింది. ఫోన్‌లో వివరించిన విధంగానే ఈసీ స్పందించింది అని టీఎంసీ ఎదురు దాడికి దిగింది. ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసిన రెండు గంటల్లో కౌంటర్ ఆడియో టేపును దీదీ శిబిరం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, టీఎంసీలు, వామపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడోసారి అధికార పీఠం దక్కించుకోవాలని సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతుంటే.. బెంగాల్‌ కోటలో కాషాయ జెండా ఎగురేయాలని బీజేపీ ఊవ్విళ్లూరుతోంది. మరోవైపు.. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. బెంగాల్‌లో తొలిదశ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. శనివారం మొత్తం 30 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. దాదాపు 80% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడం, కరోనా విజృంభణ నేపథ్యంలో అదనపు జాగ్రత్తల నడుమ యంత్రాంగం దీనిని పూర్తి చేసింది. కొన్ని కేంద్రాల్లో ఓటర్లకు మాస్క్‌లు, శానిటైజర్లు, ఈవీఎం మీట నొక్కడానికి వాడి పారేసే చేతి తొడుగులు వంటివి ఇచ్చారు. తూర్పు మేదినీపుర్‌లో అత్యధికంగా 82.5% పోలింగ్‌ జరిగింది.


By March 28, 2021 at 11:09AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/west-bengal/news/west-bengal-elections-bjp-and-tmc-complaint-against-each-other-to-election-commission/articleshow/81732690.cms

No comments