రైస్ పుల్లింగ్: నటి జయచిత్ర కొడుకు బడా మోసం.. రూ.26 కోట్ల స్కామ్

సత్యదేవ్ హీరోగా వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను చాలా మంది చూసే ఉంటారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతోన్న ఖరీదైన మోసాలను కళ్లకు కట్టినట్టు చూపించారు ఆ సినిమాలో. రెండు తలల పాము, అయస్కాంతం మాదిరిగా బియ్యాన్ని కలశం ఆకర్షించడం వంటి మోసాలను సినిమాలో చూపించారు. ఆ మోసాలను ఎంత తెలివిగా చేస్తున్నారో తెరపై ఆవిష్కరించారు. తాజాగా అలాంటి మోసం ఒకటి నిజ జీవితంలో బయటపడింది. అది కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే ఆ మోసానికి పాల్పడటం గమనార్హం. ప్రముఖ నటి జయచిత్ర (‘అబ్బాయిగారు’ సినిమాలో వెంకటేష్ తల్లి) కుమారుడు జి. అమరేశ్ గణేష్ (30) చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను ‘రైస్ పుల్లింగ్’ పేరుతో మోసం చేశాడు. వ్యాపారవేత్త నుంచి ఏకంగా రూ.26.2 కోట్లు కాజేశాడు. ఆ వ్యాపారవేత్త కేసు పెట్టడంతో అమరేశ్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మోసపోయిన వ్యాపారవేత్త పేరు వి. నేదుమారన్. ఆయన వయసు 68 సంవత్సరాలు. చెన్నై సమీపంలోని వలసరవక్కం నివాసి. తమ వద్ద ఓ ఆలయానికి చెందిన కలశం ఉందని, దాన్ని ఖరీదైన లోహం ఇరేడియంతో తయారుచేశారని, ఆ కలశం బియ్యాన్ని ఆకర్షిస్తుందని నేదుమారన్ను అమరేశ్ గ్యాంగ్ నమ్మబలికింది. 2013 నుంచి మూడేళ్ల పాటు అమరేశ్, అతడి స్నేహితులు నేదుమారన్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు. కానీ, వాళ్లు ఎంతకీ కలశం ఇవ్వకపోవడంతో నేదుమారన్ తాను మోసపోయానని గ్రహించారు. దీంతో చెన్నై పోలీస్ కమీషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నేదుమారన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అమరేశ్ను అరెస్ట్ చేశారు. అమరేశ్ ఒక తమిళ చిత్రంలో నటించారు. అలాగే, కొన్ని తమిళ సినిమాలకు సంగీత దర్శకుడిగానూ వ్యవహరించారు.
By March 17, 2021 at 07:00PM
No comments