Breaking News

కొడుకు చెంపదెబ్బ.. కుప్పకూలి తల్లి మృతి, షాకింగ్ వీడియో


కొడుకు కొట్టిన చెంపదెబ్బకు నవమోసాలు మోసి కని పెంచిన ఓ తల్లి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వృద్ధురాలైన కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు.. ఆమె చెంపపై కొట్టి అవమానించి, ఆమె మరణానికి కారణమైన ఘటన మానవతావాదులను కలచివేస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివాసం ఉండే అవ్‌తార్‌ కౌర్‌ (76)కు అతడి కుమారుడు రణ్‌వీర్ (45), కోడలితో సోమవారం (మార్చి 15) మధ్యాహ్నం వాగ్వాదం జరిగింది. పక్కింటి వారితో పార్కింగ్‌ స్థలం విషయమై జరిగిన గొడవ గురించి చర్చిస్తుండగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రణ్‌వీర్‌.. తల్లిని చెంపపై చాలా గట్టిగా కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కొడుకు కొట్టడంతో రోడ్డుపై పడిపోయిన వృద్ధురాలిని కోడలు పైకి లేపడానికి ప్రయత్నించింది. కానీ, ఫలితం లేకుండాపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రణ్‌వీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. తల్లీ, కొడుకుల మధ్య ఆస్తి విషయంలోనూ కొంత కాలంగా ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం. కారణం ఏదైనా, తల్లిని కొడుకు చెంపపై కొట్టడం, క్షణాల్లో ఆమె కుప్పకూలి మరణించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. చెంపకైన గాయం కంటే గుండెకైన గాయమే ఆ తల్లిని ఎక్కువగా బాధించిందేమో..!!


By March 17, 2021 at 07:20PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-dies-after-being-slapped-by-son-in-delhi-incident-caught-on-camera/articleshow/81552802.cms

No comments