Breaking News

సెకండ్ వేవ్: ఇప్పుడే అడ్డుకోకపోతే.. సీఎంలకు మోదీ కీలక సూచనలు


రోనా వైరస్‌ కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పరీక్షల సంఖ్య, టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని సూచించారు. కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని చెప్పారు. సెకండ్‌ వేవ్‌ను అడ్డుకొనేందుకు నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం (మార్చి 17) పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సీఎంలతో చర్చించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ రెండో దశకు చేరకుండా సత్వర, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులకు సూచించారు. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో కేసులు పెరగడం గురించి మోదీ ప్రస్తావించారు. కేసుల పెరుగుదలకు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే ఈ మహమ్మారి దేశమంతా వ్యాపించే ప్రమాదం ఉందని మోదీ హెచ్చరించారు. అనేక దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని గుర్తుచేసిన మోదీ.. కరోనా మరణాలు అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుందని పేర్కొన్నారు. RT-PCR పరీక్షలను పెంచాలని మోదీ సూచించారు. కొవిడ్‌ పరీక్షల్లో 70 శాతం ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌లే చేయాలని సూచించారు. కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్‌ను ప్రస్తావిస్తూ యాంటీజెన్‌ పరీక్షలపై ఆధారపడవద్దని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్‌ను గుర్తించేలా చిన్న చిన్న పట్టణాలపై దృష్టి సారించాలని మోదీ సూచించారు. గ్రామాల్లో కరోనా వైరస్ అలజడి రేపకుండా జాగ్తత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ‘కొవిడ్-19 మహమ్మారిపై పోరాటం ద్వారా భారత్‌ సాధించిన ఆత్మవిశ్వాసం.. నిర్లక్ష్యానికి దారితీయరాదు. ప్రజలు ఆందోళన, భయానికి గురయ్యేలా కాకుండా, ముందు జాగ్రత్త చర్యలతో వారి ఇబ్బందులు తొలగించాలి’ అని మోదీ అన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 10 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని మోదీ తెలిపారు. దీనిపై సమీక్షించుకోవాలని సూచించారు.


By March 17, 2021 at 06:13PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-video-conference-with-chief-ministers-on-covid-19-and-vaccination-highlights/articleshow/81551978.cms

No comments