Breaking News

ఉత్తరాఖండ్: సంక్లిష్టంగా రెస్క్యూ ఆపరేషన్.. వ్యూహం మార్చిన అధికారులు


ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 34 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో 170 మంది ఎమయ్యారో తెలియాల్సి ఉంది. మరోవైపు, తపోవన్-విష్ణుగడ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం వద్ద నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారికి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సొరంగం లోపల 34 మంది చిక్కుకోగా, వారిని రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. భారీ యంత్రాల సాయంతో సొరంగం వద్ద ఉన్న పూడికను తొలగిస్తున్నారు. పూడికను తొలగించి లోపలి చిక్కుకున్నవారిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలం కావడంతో సహాయక సిబ్బంది తన వ్యూహాన్ని మార్చారు. దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం లోపలికి వెళ్లడానికి బుధవారం వ్యూహం మార్చినట్టు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. సొరంగానికి సమాంతరంగా మరో మార్గాన్ని తవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ‘మేము ప్రధాన సొరంగం లోపల 70 మీటర్ల స్థలాన్ని గుర్తించాం.. అక్కడ తవ్వకం ప్రారంభిస్తాం... సుమారు 12 మీటర్ల దిగువన ఒక సిల్ట్ ఫ్లషింగ్ సొరంగం ఉంది (ఇది అవక్షేపాలతో ఉన్న నీటిని బయటకు పంపుతుంది).. శిథిలాలతో కూరుకుపోయి పాయింట్ వద్ద ప్రధాన సొరంగానికి అనుసంధానమై ఉంది.. అందులో చిక్కుకున్న కార్మికులు ఈ సొరంగంలో ఉన్నారని మేము భావిస్తున్నాం.. ఫ్లష్ టన్నెల్ ద్వారా లోపలికి వెళ్లవచ్చు’ అని వ్యాఖ్యానించారు. మొత్తం 1.6 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగంలో 180 మీటర్ల పాయింట్ క్యాచ్‌ఫ్రేజ్‌ ఉందని మంగళవారం వరకూ భావించాం కానీ, అక్కడకు చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది కావడంతో ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించాల్సి ఉంది అని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ అన్నారు. ఇదిలా ఉండగా, బుధవారం మరో రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 34కు చేరగా.. వీరిలో 10 మందిని గుర్తించారు.


By February 11, 2021 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttarakhand-glacier-burst-making-no-headway-into-tapovan-tunnel-rescuers-plan-to-dig-deep/articleshow/80825091.cms

No comments