Breaking News

వివేకానంద హత్యపై కేరళ హక్కుల కార్యకర్త సంచలన వ్యాఖ్యలు


వైఎస్‌ఆర్సీపీ నేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్యపై కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య గురించి పలు విషయాలు వెల్లడించారు. హత్య విషయంలో పలు అనుమానాలున్నాయని, లోతైన కుట్ర దాగి ఉందని అభిప్రాయపడ్డారు. అనుమానితుల గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదని, రెండు నెలల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను బయటపెడతానని అన్నారు. మూడు రోజుల కిందట వివేకా కుమార్తె సునీతారెడ్డి తనను కలిసి తండ్రి హత్య గురించి చర్చించారని జోమున్ తెలిపారు. హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సాక్ష్యాధారాల సేకరణలో ఎలా సాయం చేయాలన్న దానిపై చర్చించినట్టు పేర్కొన్నారు. వివేక హత్య కేసు నిందితులకు తప్పకుండా కఠిన శిక్ష పడేలా చేస్తామని ఆయన హెచ్చరించారు. కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో దోషులకు శిక్ష పడడంలో, సీబీఐ సాక్ష్యాధారాలు సంపాదించడంలో జోమున్ కీలక పాత్ర పోషించారు. చర్చి ఫాదర్ తన సోదరుడి సాయంతోనే తనను హత్య చేయించేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో తాను గాయాలతో బయటపడ్డానని జోమున్ తెలిపారు. చివరకు నిందితులకు శిక్ష పడిందని జోమున్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకూ నిందితులెవరో తేలలేదు. హత్య జరిగి రెండేళ్లు కావొస్తున్నా.. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. సిట్ దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోవడంతో.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వివేకానంద కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడం ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం తెలిసిందే. సీబీఐ విచారణ చేపడుతున్నప్పటికీ.. నిందితులెవరో ఇంకా తేలలేదు.


By January 17, 2021 at 12:32PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/kerala-rights-activist-jomon-puthenpurackal-interesting-comments-on-ys-vivekananda-reddy-murder-case/articleshow/80311746.cms

No comments