Breaking News

టీకా తీసుకున్న 580 మందికి సైడ్ ఎఫెక్ట్.. ఆ ఇద్దరి మరణానికి వ్యాక్సిన్ కారణం కాదు: కేంద్రం


దేశంలో కరోనా వైరస్ టీకా పంపిణీ జనవరి 16న ప్రారంభం కాగా.. మూడు రోజుల్లో 3.8 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు కేంద్రం సోమవారం సాయంత్రం వెల్లడించింది. టీకా తీసుకున్నవారిలో 580 మందికి దుష్ప్రభావాలు తలెత్తగా.. ఏడుగురిని మాత్రమే ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపింది. టీకా తీసుకున్న ఇద్దరు ఫ్రంట్‌లైన్ వర్కర్లు చనిపోయినా.. దానికి వ్యాక్సిన్ కారణం కాదని పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న మహిపాల్ (46) శనివారం కరోనా వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న 24 గంటల్లోనే అతడు మృతి చెందాడు. అయితే, మహిపాల్ గుండెపోటు కారణంగానే మరణించాడని, టీకా వల్ల కాదని పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది. కానీ, టీకా తీసుకున్న అనంతరం మహిపాల్ అస్వస్థతకు గురయ్యారని.. ఇబ్బందికరంగా ఫీలయ్యారని కుటుంబసభ్యులు తెలిపారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే మహిపాల్ మరణించాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన నాగరాజు (43) సైతం టీకా తీసుకున్న రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. అతడు కార్డియో-పల్మనరీ వైఫల్యంతోనే చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడయ్యిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, ఇదే టీకా తీసుకున్న మరో తొమ్మిది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని పేర్కొంది. సోమవారం ఉదయం విధులకు హాజరైన నాగరాజు తనకు గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పాడని, అనంతరం కుప్పకూలిపోయాడని ప్రభుత్వం వివరించింది. అతడిని హుటాహుటీన చికిత్స కోసం తరలించినా, ప్రయోజనం లేకపోయిందన్నారు. వ్యాక్సిన్ కారణంగా నాగరాజు గుండెపోటుకు గురికాలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ ప్రకటించారు. ‘ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు.. అతడికి డయాబెటిస్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి’ అని తెలిపారు. తొలి రోజు శనివారం టీకా తీసుకున్నాడని, ఆ తర్వాత ఎటువంటి లక్షణాలు కనిపించలేదన్నారు. దేశవ్యాప్తంగా ఏడుగురు ఆస్పత్రిలో చేరగా.. ముగ్గురు ఢిల్లీకి చెందిన వ్యక్తులున్నారు. వీరిలో ఇద్దర్ని డిశ్చార్జ్ చేశారని, మరో వ్యక్తి మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. కర్ణాటకలో ఇద్దరు, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఆస్పత్రిలో చేరారు. మొత్తం 3,81,305 మంది టీకా వేయగా.. సోమవారం 1,48,266 మంది తొలి డోస్ తీసుకున్నారు.


By January 19, 2021 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vaccination-drive580-adverse-reactions-two-deaths-not-linked-to-vaccine-says-centre/articleshow/80339250.cms

No comments