Breaking News

ఓ ప్రమాదం ఆమె జీవితాన్నే మార్చేసింది.. చత్తీస్‌గఢ్‌లో మొదలై కేరళలో సుఖాంతం


బస్సు ప్రయాణంలో ఉండగా కేరళకు చెందిన ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ ప్రాణాలు కాపాడి తన చేయి పోగొట్టుకున్న చత్తీస్‌గఢ్ యువతి జ్యోతి తర్వాత ఆయననే వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేయడం విశేషం. పదేళ్ల కిందట అంటే 2010 జనవరి 3న జరిగిన ప్రమాదంలో జ్యోతి తన కుడిచేతిని పోగొట్టుకోగా.. ఆమె జీవితాన్ని అదే మలుపు తిప్పింది. తన ప్రాణాల కోసం సాహసం చేసి చేయి పొగొట్టుకున్న జ్యోతిని వికాస్ ఇష్టపడ్డాడు. అయితే, జ్యోతి తల్లిదండ్రులు మాత్రం కుమార్తె చేసిన పనికి ఆగ్రహించి, బలవంతంగా చదువు మాన్పించారు. దీంతో బీఎస్సీ (నర్సింగ్) మధ్యలో ఆగిపోయింది. దీంతో వికాస్ వెంటన నడవాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి వచ్చేసింది. ఇద్దరూ వివాహం చేసుకుని ఏడాది తర్వాత కేరళకు రాగా.. వికాస్ కుటుంబం ఆమెను కోడలిగా అంగీకరించారు. ప్రమాదం జరిగిన రోజును జ్యోతి మరోసారి గుర్తుచేసుకున్నారు. తాను కాలేజీ హాస్టల్ నుంచి బస్సులో వెళ్తుండగా.. తన ముందు సీట్లో వికాస్ కూర్చున్నారు. తన సోదరుడిని కలిసి తిరిగి దంతేవాడలోని సీఐఎస్ఎఫ్ క్యాంప్‌కి తిరిగి వెళ్తూ ఆ బస్సులో ప్రయాణిస్తూ విండో రైలింగ్‌పై తలవాల్చి నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సమయంలో అత్యంత వేగంతో ఎదురుగా ఓ ట్రక్కు వస్తున్న విషయాన్ని గమనించిన జ్యోతి ప్రమాదాన్ని పసిగట్టింది. అప్పటికే వికాస్ నిద్రలో ఉండటంతో అప్రమత్తమైన జ్యోతి.. వెనుక నుంచి వికాస్ తలను వెనక్కు లాగింది. అయితే, తన కుడిచేయి తీవ్రంగా దెబ్బతింది. ఎవరో తెలియని తనకోసం జ్యోతిచేసిన సాహసానికి వికాస్ ఫిదా అయ్యాడు. ప్రస్తుతం కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కడ్ జిల్లా కొలాన్‌గొడే బ్లాక్ పంచాయితీలోని పలతూల్లే డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జ్యోతి బరిలోని నిలిచింది. మలయాళం స్పష్టంగా మాట్లాడుతున్న జ్యోతి.. అక్కడ ప్రజలు తనకు ఓటేయడం లేదా మానేయడం వేరే విషయమని, తనపై అభిమానం చూపుతున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ఫలితాల తర్వాత గణనీయమైన మార్పు వస్తుందని అన్నారు. ఆమె ఎన్నికల్లో పోటీచేస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం తనపై ఉందని, ఆయన ప్రేరణతోనే రాజకీయాల్లోకి వచ్చానని జ్యోతి వ్యాఖ్యానించింది. పార్టీ అధిష్ఠానం తనను కలిసి సీటు ఇస్తామని చెప్పిందని, దీనికి తాను అభ్యంతరం చెప్పలేదన్నారు. భర్త, కుటుంబసభ్యులు దీనికి సమ్మతించారని పేర్కొంది. పాలక్కాడ్ జిల్లాలో తన రాజకీయ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తోన్న బీజేపీ.. జ్యోతి ఉదంతం చాలా ప్రేరణగా నిలుస్తోందని భావిస్తోంది. ప్రమాదంలో జవాన్ ప్రాణాలను కాపాడటానికి తన కుడిచేతిని పోగొట్టుకుంది.. ప్రస్తుతం ఆమె కేరళ ఆడబిడ్డ అని పాలక్కడ్ బీజేపీ అధ్యక్షుడు కృష్ణదాస్ అన్నారు. జ్యోతి పోటీలో ఉండటం జిల్లాలోని 1,700 మంది బీజేపీ అభ్యర్థులకు నైతికంగా మద్దతు లభించినట్టుయ్యిందని వ్యాఖ్యానించారు.


By December 07, 2020 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-women-who-lost-arm-while-saving-jawan-life-now-fight-in-kerala-local-body-polls/articleshow/79600254.cms

No comments