Breaking News

నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. నేడు మరికొన్ని పరీక్షలు చేయనున్న డాక్టర్లు


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రక్తపోటులో హెచ్చతగ్గుల వల్లే రజినీ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌కు నేడు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రజినీ‌కాంత్‌ కుమార్తె సౌందర్య తండ్రి దగ్గరే ఉండి సపర్యలు చేస్తున్నారు. రజినీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న చాలామంది అభిమానులు చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. రజినీకి అత్యంత సన్నిహితుడైన నటుడు మోహన్‌బాబు శుక్రవారం అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. రజినీ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.


By December 26, 2020 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-rajinikanth-health-condition-is-stable-says-doctors/articleshow/79963202.cms

No comments