Breaking News

రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా స్థానిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్


కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ప్రభావం హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. హరియాణా స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. సోనేపట్, అంబాలా మేయర్ పీఠాలను అధికార బీజేపీ కూటమి చేజార్చుకుంది. అలాగే హిస్సార్ జిల్లా ఉకలానా, రేవారీ పరిధిలోని ధారూహెరాలను బీజేపీ కోల్పోయింది. ఈ రెండు స్థానాలూ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాకు కంచుకోటలు కావడం గమనార్హం. ప్రస్తుతం హరియాణాలో బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమి అధికారంలో ఉంది. గత కొన్ని వారాలుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వారికి స్థానిక హరియాణా రైతుల నుంచి కూడా మద్దతు లభించడం సహా ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. హరియాణా హోమ్ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గం అంబాలాలో బీజేపీ ఓటమి ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల్లో బీజేపీ ఓటమి పాలైందని తెలిసిన అనంతరం ధర్నాల్లో ఉన్న రైతులు మిఠాయిలు పంచుకుని, ఆనందంతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అంబాలాలో జనచేతన పార్టీకి చెందిన శక్తి రాణి శర్మ 800 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో ఆమె మేయర్ కాబోతున్నారు. జనచేతన పార్టీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ భార్య రాణి శర్మ. తొలిసారి హరియాణాలో ప్రత్యక్ష విధానంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సోనేపట్‌లో కాంగ్రెస్‌కు చెందిన మేయర్ అభ్యర్థి లలిత్ బాత్రా 14,000 ఓట్లతో విజయం సాధించారు. ‘సోనిపట్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం రైతులు నిరసనలు తెలుపుతున్న సింఘూ సరిహద్దుల పక్కనే ఇది ఉందన్న సంగతి తెలిసిందే’ అని కాంగ్రెస్ పార్టీ నేత శ్రీవాత్సవ ట్వీట్ చేశారు. అయితే, పంచకుల మేయర్ పదవి మాత్రం అతికష్టంతో బీజేపీ దక్కించుకుంది. ఇక్కడ కుల్ భూషణ్ గోయల్ విజయం సాధించారు. మొత్తం ఏడు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అంబాలాలో 20 సీట్లకు గాను అధికార బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలవడం గమనార్హం. అంబాలాలో బీజేపీ ఎనిమిది, జనచేతన పార్టీ ఏడు, కాంగ్రెస్ మూడు, హరియాణా డెమొక్రాటిక్ ఫ్రంట్ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. సోనెపట్‌లో మొత్తం 20 స్థానాలుండగా బీజేపీ 10, కాంగ్రెస్ 9, స్వతంత్రులు ఒకచోట గెలిచారు. ఇక, పంచకులలో బీజేపీ, కాంగ్రెస్ చెరో తొమ్మిది చొప్పున గెలుపొందాయి. ధర్హేరా, సప్లా, ఉకలానాలో స్వతంత్ర అభ్యర్థులు మేయర్‌గా గెలిచించారు.


By December 31, 2020 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ruling-bjp-jjp-suffered-a-setback-in-haryana-local-elections-amid-farmers-protest/articleshow/80040684.cms

No comments