Breaking News

ఒక్క చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే 42 పార్శిళ్లు.. డెలివరీ బాయ్స్‌తో వీధంతా కోలాహలం


అనుకోకుండా చేసిన చిన్న చిన్న తప్పిదాలు నలుగురి దృష్టిలో పడేంత పెద్ద విషయాలు అవుతాయి. ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ ఏడేళ్ల బాలిక చేసిన చిన్న పొరపాటుతో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంది. ఇంటర్‌నెట్ స్పీడు తక్కువగా ఉండటంతో దీనిని గమనించకుండా బాలిక చేసిన తప్పిదం చిక్కుల్లో పడేసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పైన్స్‌లోని సెబు నగరానికి చెందిన ఓ బాలిక తన తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలని భావించింది. తనతోపాటు తన బామ్మకు రెండు ఫ్రైడ్‌ చికెన్ రైస్‌ ఆర్డర్ చేయాలని భావించి, ఫుడ్ పాండా యాప్‌లో ప్రయత్నించింది. ఇదే సమయంలో ఇంటర్‌నెట్ నెమ్మదించింది. దీనిని గమనించని ఆ చిన్నారి పదే పదే క్లిక్ చేయడంతో ఒకే ఐటమ్ 40 సార్లకు పైగా ఆర్డర్ అయ్యింది. తమ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి.. కొద్ది సేపటి తర్వాత 42 డెలివరీలు వచ్చాయి. ఆ వీధి అంతా డెలివరీ బాయ్స్‌తో కోలాహలంగా మారింది. దీంతో ఆ చిన్నారి, పెద్దావిడ ఏం జరిగిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఫిలిప్పైన్స్‌ కరెన్సీలో ఓ ఆర్డర్‌కు 189 పీసోలు ఇవ్వాల్సి ఉండగా.. 42 పార్శిల్లు రావడంతో మొత్తం 7,945 పీసోలు అయ్యింది. అంత మొత్తానని ఎలా చెల్లించాలా ఆందోళన చెందుతుండగా.. ఇరుగు పొరుగువారు వెంటనే స్పందించి ముందుకొచ్చారు. వారు ఆ ఆర్డర్లను స్వీకరించి, డెలివరీ బాయ్స్‌కు డబ్బు చెల్లించారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. ఆన్‌లైన్ కంటే బయటే ఎక్కువ కొనుగోళ్లు జరిగాయంటూ ఆ నెటిజన్ చమత్కరించారు. ఇన్ని పార్శిల్లు రావడంతో మేము తినలేమని, తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో తమ వద్ద అంత డబ్బులేదని ఆ బాలిక భయపడి ఏడుపు మొదలుపెట్టిందని అన్నారు.


By December 04, 2020 at 12:43PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/one-order-many-parcels-food-app-glitch-brings-42-riders-to-philippines/articleshow/79561888.cms

No comments