Breaking News

గుజరాత్: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం


గుజరాత్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి, ఏడుగురు సజీవదహనమయ్యారు. సురేంద్ర నగర్ జిల్లా పాటది వద్ద ఓ కారును ఎదురుగా వస్తున్న డంపర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. డంపర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న పొదల్లోకి కారు దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు చెలరేగి అందులోని ప్రయాణిస్తున్న వ్యక్తులు అగ్నికి ఆహుతయ్యారు. చోటిలమాత ఆలయానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే కారులోని అందరూ మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సురేంద్ర నగర్ డిప్యూటీ ఎస్పీ హెచ్‌పీ దోషి తెలిపారు. ప్రమాదానికి కారణమైన డంపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టడంతో కారు ఇంజిన్‌ వత్తిడికి గురై మంటలు చెలరేగాయి. డోర్లు మూసుకుపోవడంతో కారులోని ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. బాధితులు అగ్నికి ఆహుతికావడంతో వాటిని అతికష్టంతో బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబాలకు వాటిని అప్పగించనున్నారు. ప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


By November 21, 2020 at 12:38PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/seven-people-killed-in-accident-due-to-collission-between-truck-and-car-in-gujrat/articleshow/79336576.cms

No comments