Breaking News

బిహార్: నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా ఉండటానికి ఇల్లే లేదు.. కాలినడకనే ప్రయాణం


ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కోట్ల రూపాయాలు పోగేసుకుని, విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారు. అలాంటిది నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా కనీసం పక్కా ఇల్లు కూడా కట్టుకోలేదు. ఆయనే బీహార్‌కు చెందిన సీపీఐ ఎమ్మెల్యే మహబూబ్ ఆలమ్. ఆయన గురించి తెలిస్తే ఈ రోజుల్లోనూ ఇటువంటి ప్రజానేత ఉంటారా? అని విస్మయం కలగకమానదు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో మహబూబ్ విజయం సాధించారు. కోసి ప్రాంతంలోని కటిహార్ జిల్లా బలరామ్‌పూర్ నుంచి మహబూబ్ నాలుగో సారి విజయం సాధించారు. ఆయనకు పక్కా ఇళ్లే కాదు.. ఈరోజుకీ ఎక్కడికి వెళ్లాలన్నా నడుచుకునే వెళుతుంటారు. బీహార్‌ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైనవారిలో 81 శాతం మంది కోటీశ్వరులున్నారు. అయితే మహబూబ్ ఆలమ్ తీరు వీరిందరికన్నా భిన్నం. అందుకే ఆయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీచేసిన ఆలమ్.. నాల్గోసారి విజయం సాధించారు. వికాశ్‌షీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి వీరేంద్ర కుమార్ ఓజాపై 53 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించిన సీపీఎం (ఎంఎల్) ఎమ్మెల్యేలో ఆలమ్ ఒకరు. ఆ ఎన్నికల్లో జేడీయూ- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి, బీజేపీతో కూడిన ఎన్‌డీఏ పోటీచేశాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరౌన్ కుమార్‌పై 20,419 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 31.7 శాతం ఆలమ్‌‌కు దక్కాయి. మహబూబ్ ఆలమ్ (44) 10వ తరగతి పాసయ్యారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా తనకు ఎటువంటి ఆస్తులు లేవని మహబూబ్ ఆలమ్ అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు. ఇక, 2016లో ఓ బ్యాంకు మేనేజర్‌పై ఆలమ్ దాడిచేసినట్టు కేసు నమోదయ్యింది. ఈ ఆరోపణలను ఆలమ్ తీవ్రంగా ఖండించారు. ‘ఒకవేళ ఆ బ్యాంకు మేనేజర్‌ తనపై ఫిర్యాదు చేసుంటే నేను కూడా అతడిపై కౌంటర్ కేసు వేస్తాను.. ప్రజా సమస్యలపై అతడిని కలిశాను.. ఆయన ఓ అవినీతిపరుడు’ అని అన్నారు.


By November 14, 2020 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-elections-2020-fourth-time-mla-mehboob-alam-still-remains-without-house/articleshow/79220900.cms

No comments