Breaking News

ఆగ్రా: ఇంటిలోనే వైద్యురాలు దారుణ హత్య.. సీసీటీవీ ఫుటేజ్‌లో షాకింగ్ వివరాలు


సెటప్ బాక్స్ రీఛార్జ్ సాకుతో ఇంటిలోకి చొరబడిన ఓ ఆగంతకుడు వైద్యురాలిని హత్యచేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన డాక్టర్ నిషా సింఘాల్ (38)పై కత్తితో దాడిచేసి గొంతు కోసి హత్యచేశారు. వైద్యురాలి పిల్లలు వేరే గదిలో ఉండగా ఈ హత్య జరిగింది. ఆమె పిల్లలుపై కూడా దుండగుడు దాడిచేసినా వారు ప్రాణాలతో బయటపడ్డారు. తల్లి కేకలు విని గదిలోకి వచ్చిన చిన్నారులపై ముష్కరుడు దాడి చేశాడు. ఈ హత్య జరిగిన సమయంలో నిషా సింఘాల్ భర్త డాక్టర్ అజయ్ హాస్పిటల్‌లో ఉన్నారు. అయితే, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కేబుల్ టీవీ టెక్నీషియన్‌గా నటిస్తూ సింఘాల్ నివాసంలోకి చొరబడ్డ నిందితుడు ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు, వైద్యురాలిని హత్యచేసి, ఆమె పిల్లలపై దాడి తరువాత ఒక గంట పాటు నిందితుడు ఆ ఇంట్లోనే ఉన్నట్టు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ నిషా సింఘాల్‌ను చికిత్స కోసం ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. ఆగంతుడు దోపిడీకి యత్నించగా ఆమె అడ్డుకోవడంతోనే కత్తితో దాడిచేసినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. గత రెండు రోజుల్లో నిందితుడు ఈ ఇంటికి రెండోసారి వచ్చినట్టు గుర్తించారు. ఈ హత్యోందంతంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఆగ్రాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఓ మహిళను ఆమె ఇంటిలోనే గొంతుకోసి హత్యచేసిన ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.. అవినీతి అధికారులను కాపాడటంలోనూ, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించడంలో బీజేపీ ప్రభుత్వం బిజీగా ఉంది.. కేవలం మీడియాలో ప్రకటనలపైనే దృష్టి పెట్టకుండా ఉత్తర ప్రదేశ్‌లో నేరాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి’ అని అఖిలేశ్ చురకలంటించారు.


By November 21, 2020 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dentist-murdered-at-home-while-her-children-were-in-another-room-in-uttar-pradesh/articleshow/79336145.cms

No comments