Breaking News

రొమేనియా: రొమెనియా కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 10 మంది సజీవదహనం


కోవిడ్-19 హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన రొమేనియాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. ఇయాసీ నగరం పియాత్రా నేమట్ కౌంటీ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో తొలుత మంటలు ప్రారంభమై.. అక్కడ నుంచి కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న గదులకు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియదని పేర్కొన్నారు. అయితే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వీరిలో ఓ వైద్యుడు కూడా ఉన్నారన్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. రొమేనియా ఆరోగ్య మంత్రి నెలూ తాత్రూ మాట్లాడుతూ.. ఆరుగురు క్షతగాత్రులను మరో కోవిడ్-19 ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఓ వైద్యుడు 40 శాతం మేర గాయపడ్డారని, అతడిని మెరుగైన వైద్యం కోసం రాజధాని బుకారెస్ట్‌లోని ఓ ఆస్పత్రికి తరలించనున్నామని వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆరోగ్య శాఖతో సమన్వయం చేయనున్నామని తాత్రూ వ్యాఖ్యానించారు. అగ్ని ప్రమాదం జరిగిన ఆస్పత్రిలోని మరో ఫ్లోర్‌లో ఐసీయూ విభాగం నడుపుతున్నట్టు వివరించారు. ఇక, 2015 తర్వాత రొమేనియాలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఇదే. బుకారెస్ట్ నైట్ క్లబ్‌లో 2015న జరిగిన అగ్ని ప్రమాదంలో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపా దేశమైన రొమేనియాలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇప్పటి వరకు అక్కడ 353,185 మంది కరోనా వైరస్ బారినపడగా.. 8,813 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ 13వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 1,700 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.


By November 15, 2020 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ten-killed-and-seven-injured-in-fire-accident-at-covid-19-hospital-in-romania/articleshow/79228536.cms

No comments