Breaking News

కరోనాను కట్టడిచేయాలంటే ధనవంతులపై అధిక పన్నులు వేయాల్సిందే.. మోదీకి నోబెల్ గ్రహీత సూచన


ధనికులపై అధికంగా పన్నులు విధించి, అవసరమైన నిధుల సేకరించి భారత ప్రభుత్వం పేదల కోసం ఖర్చు చేయాలని అమెరికా ఆర్దికవేత్త, నోబెల్ విజేత జోసెఫ్ స్టింగ్లిజ్ సూచించారు. కరోనా వైరస్‌ను కట్టిడిచేసి, ఈ మహమ్మారి బారినపడ్డ బలహీనవర్గాలను ఆదుకునేందుకు ఖర్చు విషయంలో వెనుకాడరాదని అన్నారు. కోల్‌కతాలో ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో స్టింగ్లిజ్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో అధిక వ్యయమయ్యే రంగాలకు తగిన రీతిలో ఖర్చు చేయాలని అన్నారు. దేశంలో లెక్కకుమించి కోటీశ్వరులు ఉన్నారని, వారంతా ముందుకువచ్చి కోవిడ్‌ను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి నిధులు అందజేసి సహకరించాలని కోరారు. అమెరికా, భారత్‌లో కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని, వలస కార్మికుల కారణంగానే ఇక్కడ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఫలితంగా కరోనా కట్టడి కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. జూన్ త్రైమాసికానికి భారత జీడీపీ రికార్డుస్థాయిలో 24 శాతం తగ్గిపోయిందన్నారు. కరోనా కట్టిడికి డబ్బు ఖర్చు చేయకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం వ్యయాన్ని లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని, బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ అత్యంత హాని కలిగించేవారికి సహాయం చేయాలని నొక్కిచెప్పారు. కరోనా వైరస్ కట్టడికి భారత్ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం మంచిదే.. కానీ, దీనిని ఎలా అమలు చేయాలి.. పేదలపై ఎటువంటి ప్రభావం చూపందనేది ఆలోచించలేదన్నారు. కరోనా కట్టడిలో జర్మనీ, న్యూజిలాండ్ అనుసరించి విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయని, మిగతా దేశాలు కూడా వాటిని అనుసరించాలని తెలియజేశారు. కాగా ఇటీవల ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనవంతులు పలు ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ... కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అత్యంత ధనవంతులపై అధిక పన్నులు విధించాలని కోరారు. ఆదాయ కొరతను తీర్చడానికి సంపన్నులపై అధిక పన్నులు విధించాలని భారత రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చేసిన ప్రతిపాదనను కేంద్రం ఇంతకు ముందు తిరస్కరించింది. అంతేకాదు, ఈ నివేదికను బయటపెట్టిన ముగ్గురు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. దేశంలోని 953 ధనిక కుటుంబాలపై 4 శాతం అధిక పన్ను విధిస్తే భారతదేశ జీడీపీలో 1% కు సమానమైన మొత్తాన్ని ఖజానాకు సమకూరుతుందని ఏప్రిల్‌లో ఒక నివేదిక వెల్లడించింది.


By October 06, 2020 at 11:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-raise-taxes-on-the-rich-and-spend-the-poor-people-says-joseph-stiglitz/articleshow/78508779.cms

No comments