Breaking News

బొగ్గు కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రిని దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు


బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి సహా మరో ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మాజీ మంత్రి దిలీప్ రే అక్రమాలకు పాల్పడినట్టు న్యాయస్థానం గుర్తించింది. ఝార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలకు జరిగినట్టు ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. నాటి కేంద్ర మంత్రి దిలీప్ రే, సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద గౌతమ్‌, క్యాస్ట్రన్ టెక్నాలజీ, ఆ సంస్థ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌ను న్యాయమూర్తి భారత్ పరాశర్ దోషులుగా పేర్కొన్నారు. ఈ కేసులో దోషులకు అక్టోబరు 14న శిక్షలు ఖరారుచేయనున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. అక్టోబరు 14న శిక్ష ఖరారుపై ఇరు వర్గాల వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌ గిరిదహ్ జిల్లా బ్రహ్మదిహ బొగ్గు గనులను నిబంధనలకు విరుద్దంగా క్యాస్ట్రన్ టెక్నాలజీకి కేటాయించినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదుచేసింది. ఆ సంస్థకు లీజు కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడయ్యింది. దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో కేంద్ర మాజీ మంత్రి, ఇద్దరు అధికారులను దోషులుగా నిర్ధారించింది. కాగా, కేసులో ఓ కేంద్ర మంత్రి దోషిగా తేలడం ఇదే తొలిసారి. ఇక, 2017 మేలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీశ్ చంద్ర గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి భారత్ పరాశర్ తీర్పు వెలువరించారు. ఒక ప్రైవేటు సంస్థకు అక్రమంగా బొగ్గు క్షేత్రాలు కేటాయించినందుకు ఆయనకు ఈ శిక్ష విధించారు.


By October 06, 2020 at 12:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-union-minister-dilip-ray-convicted-in-coal-scam-case/articleshow/78509480.cms

No comments