Breaking News

పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడుతోన్న యువత.. సొంత వైద్యంతో మరిన్ని చిక్కులు


ప్రస్తుతం సోకి ఐసీయూలో చికిత్స పొందుతున్నవారిలో 30 శాతం మంది 40 ఏళ్లలోపు వారేనని, గత నెలలో ఇటువంటి కేసులు 34 శాతం మేర పెరిగాయని వైద్య నిపుణులు తెలియజేశారు. కరోనా వైరస్ లక్షణాలు బయటపడిన యువత వైద్యులను సంప్రదించకుండానే సొంతంగా ఔషధాలు తీసుకోవడంతో దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ కేంద్రాల్లో 25 శాతం మంది ఇటువంటి బాధితులే ఉన్నారని, వీరంతా 40 ఏళ్లలోపు యువతేనని పేర్కొన్నారు. మొత్తం కరోనా బాధితుల్లో 31.15 శాతం యువతే కాగా.. మృతుల్లో 4.76 శాతం వీరేనని తేలింది. బీఎంసీ కోవిడ్-19 కేర్ సెంటర్ డీన్ డాక్టర్ రాజేశ్ డేరా మాట్లాడుతూ.. వైరస్ నిర్దారణ అయిన లేదా లక్షణాలు ఉన్నప్పటికీ యువత ఇంట్లోనే వైద్యుల సలహా లేకుండా సొంతంగా ఔషధాలను తీసుకుంటున్నారు.. తర్వాత సమస్యలతో అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడం చాలా రోజులుగా గమనిస్తున్నామని అన్నారు. అటువంటి వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్వల్ప లేదా మోస్తరు స్థాయిలో వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి.. మోస్తరు లక్షణాలు ఉన్నవారికి వైరస్ తీవ్రత ఎక్కువకావడంతో చికిత్స వ్యవధి పెరుగుతుంది.. కొంత మందిని ఐసీయూలో చేర్పించి వైద్యం చేస్తుండగా.. కొందరు చనిపోతున్నారు అని డాక్టర్ రాజేశ్ అన్నారు. ఓ వ్యక్తికి జ్వరం రావడంతో ఇన్‌ఫ్లూయెంజాగా భావించి సొంతంగా మందులు వేసుకోగా.. ప్రస్తుతం అతడు తమ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు మాట్లాడుతూ.. సెప్టెంబరు 22న తనకు తలనొప్పి, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి.. ఇంతకు ముందు నాలుగు ఐదుసార్లు ఇలా జరగడంతో ఫ్లూ జర్వం అనుకున్నానని తెలిపాడు. అందుకే నాలుగు రోజులు పారాసెట్మల్ వేసుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పురాలేదు. దీంతో కోవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా వచ్చిందన్నాడు. సొంతంగా ఔషధాలు తీసుకున్న మరో యువకుడి కూడా పరిస్థితి విషమించింది. దీంతో ఆస్పత్రిలో చేర్చి ఆక్సిజన్ అందజేశారు. కోవిడ్-19 నిబంధనలు క్రమంగా సడలించడంతో చాలా మంది యువత మాస్క్ ధరించడం, భౌతికదూరం వంటి సంరక్షణ చర్యలు తీసుకోవడంలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు కనబడిన తర్వాత సొంతంగా ఔషధాలు తీసుకుంటున్నారు. దీంతో దుష్ప్రభావాలు తలెత్తి పరిస్థితి విషమిస్తోందని పేర్కొన్నారు.


By October 06, 2020 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-surge-in-people-under-40-self-medication-makes-it-worse-experts-warn/articleshow/78507921.cms

No comments