Breaking News

భైంసా: భార్యభర్తలను కారుతో గుద్దించిన ఫ్యామిలీ.. ఆపై కర్రతో దాడి


ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువజంటలపై కుటుంబ సభ్యులు దాష్టీకం చూపారు. ఇటీవల జరిగిన హేమంత్ హత్య కేసు మర్చిపోకముందే ప్రేమ జంటపై హత్యా ప్రయత్నం జరగడం గమనార్హం. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న జంటను విడదీయాలనే ఉద్దేశంతో వారు బైక్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన నాగజ్యోతి, అక్షయ్‌లు ప్రేమించుకున్నారు. వీరు గతేడాది మే 28న పెళ్లి చేసుకున్నారు. 15 నెలలుగా కలిసి కాపురం చేశారు. నెల క్రితం నాగజ్యోతి తల్లికి ఆరోగ్య సమస్య అని చెప్పి ఇంటికి పిలిపించారు. ఆమె కుటుంబ సభ్యులు భర్తకు విడాకులు ఇచ్చేయాలని ఒత్తిడి చేశారు. లేదంటే అక్షయ్‌ని చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో విడాకులు కూడా ఇప్పించారు. అయినా యువజంట ఇద్దరి మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, బుధవారం కుంటాల మండలంలోని కల్లూరులో డిగ్రీ పరీక్షలు రాసేందుకు నాగజ్యోతి వెళ్లింది. పరీక్ష తర్వాత అక్షయ్‌తో కలిసి బైక్‌పై భైంసాకు వస్తున్న క్రమంలో ఆమె సోదరులు ముగ్గురు వారిని వెంబడించి కారుతో ఢీకొట్టారు. బిజ్జూర్‌-చింతల్‌బోరి గ్రామాల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కింద పడిపోవడం తీవ్రగాయాలయ్యాయి. ఆమె భర్త అక్షయ్‌పై వారు కర్రతో కూడా దాడిచేశారు. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.


By October 09, 2020 at 08:13AM


Read More https://telugu.samayam.com/telangana/news/family-members-attacks-on-a-couple-who-did-love-marriage-in-bhainsa/articleshow/78565529.cms

No comments