Breaking News

అన్నాడీఎంకే సీఎంగా అభ్యర్థిగా పళనిసామి.. శశికళకు భారీ షాక్ ఇచ్చిన ఈడీ


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, శశికళ కుటుంబానికి చెందిన దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది. బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్‌ ఆస్తులను స్తంభింపజేస్తూ ఈడీ కొరడా ఝలిపించింది. సిరుదావూర్‌ బంగ్లా, కొడనాడు ఎస్టేట్‌, పోయెస్‌ గార్డెన్‌లో కొత్తగా నిర్మిస్తున్న బంగ్లా, శశికళకు చెందిన రూ.300 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఈ ముగ్గురి నివాసాలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలపై 2017లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి, 60కిపైగా డొల్ల కంపెనీల ద్వారా రూ.1,500 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిసామినే బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి కొద్ది క్షణాల్లోనే శశికళ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాదు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శశికళ జైలు నుంచి విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు 2017లో వెలువరించిన ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. అయితే, మూడేళ్ల కిందట ఆదేశాలిస్తే ఇంత ఆలస్యంగా చర్యలు తీసుకోడానికి గల కారణాలు మాత్రం వివరించలేదు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం మూడు నెలల కిందట తెరపైకి వచ్చింది. సెప్టెంబరు 28న జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలు తలెత్తాయి.


By October 08, 2020 at 06:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-ex-cm-jayalalithaa-aid-vk-sasikalas-assets-worth-1500-crore-seized/articleshow/78544973.cms

No comments