Breaking News

కాలిఫోర్నియా కార్చిచ్చు: నగరాలకు మంటలు.. కాలిబూడిదవుతోన్న వందలాది ఇళ్లు


మరోసారి కాలిఫోర్నియా అడవులను కార్చిచ్చు దహించవేస్తోంది. తాజాగా, చెలరేగిన దావానలంలో లక్షలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. అడ్డూ అదుపు లేకుండా చెలరేగిన మంటల కారణంగా, సమీప ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఓరెగాన్‌లో వందలాది గృహాలు మంటలకు కాలిబూడిదయ్యాయని కాలిఫోర్నియా గవర్నర్ కేట్ బ్రౌన్ తెలిపారు. మంటలకు బలమైన గాలులు ఆజ్యం పోశాయని, అనేక వర్గాలు గణనీయంగా నాశమయ్యాయని పేర్కొన్నారు. అడవుల్లో చెలరేగిన మంటల్లో ఇంత పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడం కాలిఫోర్నియా చరిత్రలోనే తొలిసారని ఆయన ఆవేదన చెందారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం ఉపశమనం లభించే సూచనలు కనిపించడంలేదని, గాలులు బలంగా వీస్తుండటంతో పట్టణాలు, నగరాలకు మంటలు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు పట్టణాలు గణనీయంగా దెబ్బతిన్నాయని చెప్పిన బ్రౌన్.. ఎన్ని గృహాలు మంటలకు ఆహుతయ్యాయనేది స్పష్టంగా చెప్పలేదు. కానీ, అత్యవసర నిర్వహణ అధికారులు 4,70,000 ఎకరాలకు పైగా అడవులు కాలిబూడిదవుతున్నట్టు తెలిపారు. ఒరోవిల్లే, పారడైజ్ పట్టణంలో కొంత భాగం సహా ఉత్తర కాలిఫోర్నియాలో వేలాది మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు బుధవారం పిలుపునిచ్చారు. మంటలు పెద్ద ఎత్తున ఆ దిశగా సాగుతున్నాయని అధికారులు హెచ్చరించారు. సాక్రమెంటోకు ఉత్తరాన 65 మైళ్ల దూరంలో ఉన్న ఒరోవిల్లేలో 20,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఒరోవిల్లెకు ఉత్తరాన ఉన్న ప్యారడైజ్ పట్టణం 2018 నాటి కార్చిచ్చుకు నాశనమైంది. అమెరికాలో అత్యంత జనాభా కలిగిన కాలిఫోర్నియా రాష్ట్రంలో దావానలం చెలరేగేందుకు అవకాశం వున్న సీజన్‌‌కు దాదాపు రెండు నెలల సమయం ఉంది. వేడిగాలులను తట్టుకుంటూనే వేలాది అగ్నిమాపక యంత్రాలు మంటలతో పోరాడుతున్నాయి. గత 33 ఏళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో అడవులు తగలబడలేదని కాలిఫోర్నియా అటవీ పరిరక్షణ సంస్థ ప్రతినిధి లినే వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఇప్పటికిది రికార్డేనని ఇంకా సీజను ముగియనుకూడా లేదని అన్నారు. ఇప్పటి వరకూ మంటలకు ఏడుగురు బలయ్యారు.


By September 10, 2020 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/evacuations-in-california-and-oregon-as-destructive-fire-outbreak-engulfs-region/articleshow/78031171.cms

No comments