Breaking News

ట్రంప్‌నకు విషపదార్థంతో కూడిన పార్శిల్.. అధికారుల గుర్తింపుతో తప్పిన ముప్పు


విష పదార్థంతో కూడిన ఓ పార్శిల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వైట్‌‌హౌస్‌ చిరునామాకు గుర్తుతెలియని వ్యక్తులు పంపడం కలకలం రేగుతోంది. అయితే, ఈ పార్మిల్‌ను సకాలంలో గుర్తించిన అధికారులు తనిఖీ కేంద్రంలోనే నిలిపివేశారు. ప్రాథమిక నిర్ధారణ పరీక్షల్లో అది రిసిన్‌ అనే విషపదార్థంగా గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అధ్యక్షుడు ట్రంప్ పేరిట ఓ అనుమానిత కవర్‌ వచ్చిందని.. విచారణ కొనసాగుతుందని మాత్రం దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ), సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీస్‌ కలిపి సంయుక్తంగా దీనిపై విచారణ జరుపుతున్నాయి. యుఎస్ ప్రభుత్వ మెయిల్ సర్వీసుకు అనుమానాస్పద లేఖ వచ్చింది.. దీని వల్ల భద్రతకు ఎటువంటి ముప్పు లేదు’ అని ఎఫ్‌బీఐ తెలిపింది. గతంలోనూ ఈ తరహా లేఖలు వైట్‌హౌస్ చిరునామాతో వచ్చాయి. 2018లో మాజీ నేవీ అధికారి ఒకరు రిసిన్‌తో కూడిన ఓ లేఖను ట్రంప్‌నకు పంపారు. దీన్ని ముందుగానే గుర్తించి నిందితుణ్ని అరెస్టు చేశారు. 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు మిస్సిసిపీకి చెందిన ఓ అధికారి రిసిన్‌తో రుద్దిన లేఖను పంపారు. అధికారులు దాన్ని ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. ఇలా పలువురు ఫెడరల్‌ అధికారులకు కూడా గతంలో విషంతో కూడిన లేఖలు వచ్చాయి. రిసిన్‌ ఆముదపు గింజల్లో సహజంగా నిక్షిప్తమై ఉంటుంది. కొన్ని రసాయనిక చర్యల ద్వారా దీన్ని గింజల నుంచి వెలికితీస్తారు. సాధారణంగా ఆముదపు గింజల్నిశుద్ధి చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల నుంచి రిసిన్‌ను తయారు చేస్తారు. దీనికి ఎక్స్‌పోజ్‌ అయిన 36 నుంచి 72 గంటల్లో మనిషి ప్రాణాలు కోల్పోతాడు. వాంతులు, వికారం, కడుపు, పేగుల్లో అంతర్గత రక్తస్రావం జరిగి కాలేయం, కిడ్నీలు, ప్లీహము చెడిపోయి, శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పటి వరకు దీనికి విరుగుడు మందు లేకపోవడం గమనార్హం.


By September 20, 2020 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/parcel-with-ricin-poison-mailed-to-us-president-donald-trump-and-blocked-by-police/articleshow/78214365.cms

No comments