Breaking News

పాక్ దుర్నీతికి పక్కా ఆధారం ఇదిగో... ఉగ్రవాదిని ఐఎస్ఐ అధికారిగా పేర్కొంటూ సర్టిఫికెట్


తమ ప్రతినిధుల ద్వారా జమ్మూ కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు పక్కా ఆధారం లభించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అధినేత సయ్యద్ మొహమూద్ యూసఫ్ అలియాస్ సయ్యద్ సలావుద్దీన్ పేరుతో పాక్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓ సర్టిఫికెట్ జారీచేసింది. ఓ ఉగ్రవాదిని మంచి అధికారి అంటూ పాక్ నిఘా సంస్థ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ లేదా కమాండింగ్ ఆఫీసర్ వాజా‌హత్ అలీ ఖాన్ పేరుతో విడుదలయిన ఈ లేఖలో.. ‘సయ్యద్ మొహమూద్ యూసఫ్ షా, అమీర్ హిజ్బుల్ ముజాయిద్దీన్.. ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నారు.. అతను ఈ విభాగానికి మంచి అధికారి’ అని పేర్కొన్నారు. సలావుద్దీన్ ఉపయోగించిన వాహనం వివరాలను తెలియజేస్తూ భద్రతపరంగా అంశాలను పరిశీలించాం.. అనవసరంగా ఆయన వాహనం ఆపకూడదు’ అని ఆదేశించారు. డిసెంబరు 31, 2020 వరకు ఇది చెల్లుబాటు అవుతుందని అందులో తెలిపారు. హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థ అధినేత సలాలుద్దీన్‌.. అమెరికా, భారత్‌లో యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ (యుజేసీ)కి నాయకత్వం వహిస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధించిన లస్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు యూజేసీ అనుబంధ సంస్థ. ‘కశ్మీర్‌లో పాక్ యుద్ధంలో పోరాటం చేస్తామని’ 2012న ఒక ఇంటర్వ్యూలో అంగీకరించాడు. ఉత్తర కశ్మీర్‌లో మళ్లీ పాగా వేసేందుకు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాయిద్దీన్ ప్రయత్నిస్తోందని సైనిక ఉన్నతాధికారి బ్రిగేడియర్‌ ఎన్‌.కె.మిశ్రా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఉత్తర కశ్మీర్‌లో సుదీర్ఘ కాలం తర్వాత హిజ్బుల్‌ ముజాయిద్దీన్‌ సంస్థ ఉగ్రవాదులు మృతిచెందారు. గడిచిన కొన్నేళ్లలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను సమర్థంగా అణచివేశాం. హిజ్బుల్‌ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో చాలా తక్కువ. వారి వ్యూహాలను భగ్నం చేయడానికి మన భద్రతా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఆ సంస్థకు చెందిన మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే స్వాగతిస్తాం. కానీ ఎవరైనా ఉగ్రవాదులుగా మారాలనుకుంటే మాత్రం ఉపేక్షించం’ అని మిశ్రా హెచ్చరించారు. రాష్ట్ర డీఐజీ సులేమాన్‌ మాట్లాడుతూ ‘బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో ఉగ్రవాదులు తొలుత ఓ ఇంట్లో చొరబడి చిన్న పిల్లలు సహా 12 మంది స్థానికులను బందీలుగా చేసుకున్నారు. మృతి చెందిన మిలిటెంట్లలో ఇద్దరు.. రావత్‌పోరా(డెలినా)కు చెందిన షఫ్కత్‌ అలీ ఖాన్‌, బారాముల్లా పాత పట్టణానికి చెందిన హనన్‌ బిలాల్‌ సోఫీ అని తేలింది. మూడో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది’ అని చెప్పారు.


By September 06, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-agencies-get-pak-document-certifying-hizbul-chief-salahuddin-as-official-of-isi/articleshow/77957058.cms

No comments