Breaking News

వ్యాక్సిన్‌పై సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.. రాష్ట్రాలకు నిపుణుల కమిటీ సూచన


కొవిడ్‌ వ్యాక్సిన్‌పై నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో కరోనా వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కీలకంగా చర్చించింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సూచనలు ఉండటంతో టీకా లభ్యత, సరఫరా, చేరవేసే విధానం, పాటించాల్సిన విధివిధానాలు, మౌలిక సదుపాయాలపై నిపుణులు చర్చించారు. పలు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. ఆయా సంస్థల్లో పరిశోధనలు ఏ దశలో ఉన్నాయో సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్లపై జాతీయ సాంకేతిక సలహా బృందం నుంచి వివరాలు కోరారు. వ్యాక్సిన్‌ ప్రక్రియను ట్రాక్‌ చేయడానికి ఉన్న వ్యవస్థలపై కూడా నిపుణుల బృందం చర్చలు జరిపింది. దేశీయ, విదేశీ వ్యాక్సిన్ల సేకరణ, ప్రజలకు చేరువ చేయడానికి ప్రాధాన్యత మార్గదర్శకాలు, ఆర్థిక వనరులపై నిపుణుల బృందం దృష్టి సారించింది. వ్యాక్సిన్‌ భద్రత, నిఘాకు సంబంధించి తలెత్తే సమస్యలపై కూడా కమిటీ సభ్యులు సమావేశంలో చర్చించారు. రాష్ట్రాలు తమ మార్గాల ద్వారా వ్యాక్సిన్ సేకరించవద్దని అన్ని రాష్ట్రాలకు నిపుణుల బృందం ఈ సందర్భంగా సూచించింది. వ్యాక్సిన్ల తయారీలో ముఖ్యమైన పొరుగు దేశాలు, అభివృద్ధి భాగస్వామి దేశాలకు మద్దతు ఇవ్వడం గురించి చర్చించారు. దేశీయ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం, స్వదేశంలోనే కాకుండా తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో కూడా వ్యాక్సిన్లను త్వరగా పంపిణీ చేయడానికి అన్ని అంతర్జాతీయ సమాజాలతో కలిసి పనిచేస్తుందని నిపుణుల బృందం చర్చించింది.


By August 13, 2020 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/expert-committee-discuss-strategy-for-availability-and-delivery-mechanism-of-coronavirus-vaccines/articleshow/77516677.cms

No comments