Breaking News

పుల్వామా ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టిన సైన్యం


దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గతంలో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసి.. తీవ్రవాదిగా మారిన షాకూర్ అహ్మద్ పర్రే కూడా ఈ ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. తాజాగా, పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. పుల్వామాలోని జాదూరా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన ఎదురుకాల్పులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జాదూరాలో ఉగ్రవాదులున్నట్టు నిఘా వర్గాల సమాచారం అందడంతో సైన్యం అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు గాలిస్తుండగా.. ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సైన్యం కాల్పుల్లో గుర్తుతెలియని ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు శ్రీనగర్ విభాగం రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కూడా తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు. ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ చేపట్టామని అన్నారు. ఆ ప్రాంతంలో ఆయుధాలను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఇక, శుక్రవారం సాయంత్రం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన షాకూర్ అహ్మద్ నాలుగున్నరేళ్ల క్రితం అనంతనాగ్ జిల్లాలోని బిజ్బేహర పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు ఏకే-47 తుపాకీలతో పరారయ్యాడు. అనంతరం అల్ బదర్ అనే ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసి.. షోపియాన్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. ముందు స్పెషల్ పోలీసు ఆఫీసరుగా పని చేసి.. తర్వాత కానిస్టేబుల్.. ఆపై ఉగ్రవాదిగా మారిన షాకూర్.. పది మందిని యువకులను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరిలో ఇప్పటికే ఐదుగుర్ని మట్టుబెట్టామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో షాకూర్‌తో చనిపోయిన మరో టెర్రరిస్ట్‌ను సుహైల్ భట్‌‌గా గుర్తించారు. అతడు ఖన్మోమ్ గ్రామ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసి హతమొదించాడు. ఉగ్రవాదుల దగ్గర్నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని భద్రతా బలగాలు తెలిపాయి.


By August 29, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-unidentified-terrorists-killed-an-encounter-pulwama-in-kashmir/articleshow/77815651.cms

No comments