Breaking News

గాల్వాన్ ఘర్షణలో చైనా సైనికుల మరణానికి తొలి సాక్ష్యం.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్


సరిహద్దుల్లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయ వద్ద జూన్‌ 15న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది వరకు చైనా సైనికులు చనిపోయినట్టు ప్రచారం జరిగింది. అయితే, తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే విషయంపై చైనా ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ఘర్షణలో భారత జవాన్ల దెబ్బకు సీపీఎల్‌ఏ‌ జవాన్లు గట్టిగానే రుచి చూశారనడానికి చైనా సోషల్ మీడియా వెయ్‌బోలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో సాక్ష్యంగా నిలిచింది. ఇందులో చైనాకు చెందిన చెన్‌ షియాంగ్రాంగ్‌ (19) అనే సైనికుడి సమాధి ఉంది. అతడి మృతికి కారణాన్ని వివరిస్తూ మాండరిన్‌ భాషలో కొన్ని వ్యాక్యాలు రాసి ఉన్నాయి. ‘ఫుజియాన్‌లోని పింగ్నాన్‌కు చెందిన 69316 యూనిట్‌ సైనికుడు చెన్‌ షియాంగ్రాంగ్‌ సమాధి ఇది. 2020 జూన్‌లో భారత సరిహద్దు బలగాలతో జరిగిన ఘర్షణలో ప్రాణ త్యాగం చేశాడు. కేంద్ర సైనిక కమిషన్‌ ఆయనను మరణానంతరం స్మరించుకుంటోంది’ అని దానిపై రాసి ఉంది. దక్షిణ షిన్‌జియాంగ్‌ సైనిక ప్రాంతంలో ఆగస్టు 5న ఈ సమాధి శిలను ఏర్పాటు చేసినట్లు కూడా ఫొటో చెబుతోంది. అయితే ఇది నిజమైన చిత్రం కాదని కొందరు నెటిజన్లు వాదించారు. దీనిపై చైనా అధికారులు స్పందించలేదు. గాల్వన్ ఘర్షణలో ఓ కల్నల్ సహా 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. తూర్పు లడఖ్‌లోని భారత భూభాగంలోకి చైనా సైన్యం ఈ ఏడాది మే తొలివారంలో చొచ్చుకురావడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భారత్, చైనా సైనికాధికారులు, దౌత్య వర్గాల మధ్య పలుసార్లు దీనిపై చర్చలు జరిగి.. గాల్వాన్ లోయ సహా కొన్ని ప్రాంతాల నుంచి సైన్యం వైదొలగింది.


By August 29, 2020 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/picture-of-dead-chinese-soldiers-grave-gives-first-evidence-of-pla-losses-in-galwan-clashes/articleshow/77815429.cms

No comments