Breaking News

కశ్మీర్‌లో ఎదురుకాల్పులు: అమరుడైన జవాన్.. ఓ ఉగ్రవాది హతం


జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ అమరుడుకాగా.. ఓ ముష్కరుడ్ని సైన్యం హతమార్చింది. కమ్రాజిపుర ప్రాంతంలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య మంగళవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కమ్రాజిపుర గ్రామంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం.. మంగళవారం అర్ధరాత్రి అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు పాల్పడటంతో అప్రమత్తమైన సైన్యం.. ఎదురుకాల్పులు ప్రారంభించిందన్నారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా.. ఓ ఉగ్రవాదిని హతమార్చినట్టు వెల్లడించారు. కాల్పులలో హతమైన ఉగ్రవాదిని గుర్తించే పనిలో ఉన్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన జవాన్‌ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలిలో ఏకే 47 రైఫిల్, కొన్ని గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


By August 12, 2020 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-soldier-killed-in-encounter-in-jks-pulwama-terrorist-shot-dead/articleshow/77498436.cms

No comments