Breaking News

మరుభూమిగా బీరుట్.. పేలుళ్లలో 78 మంది మృతి, 4వేల మందికిపైగా గాయాలు


లెబనాన్‌ రాజధాని నగరం బీరుట్‌ మంగళవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల దాటికి పలు భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా 4,000 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో వందలాది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద అనేకమంది సజీవ సమాధి అయ్యాయరని అధికారులు తెలిపారు. జర్మనీ జియోసైన్సెస్ ఈ పేలుడును 3.5 తీవ్రత భూకంపంతో పోల్చింది. అంతేకాదు, మధ్యదరా ప్రాంతం మీదుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైప్రస్ వరకు వినిపించింది. అణుబాంబును మించిన విస్ఫోటనంతో పేలుడు సంభవించడం సుడులు సుడులుగా దట్టమైన పొగ ఎగిసిపడింది. సమీపంలోని భవనాలకు మంటలు విస్తరించడంతో తీవ్రత మరింత పెరిగింది. అనేక భవంతుల్లో కిటికీలు, ఇళ్లలో సీలింగ్ పైకప్పులు తునాతునకలైపోయాయి. ఎక్కడ చూసినా భవనాల శిథిలాలు, దెబ్బతిన్న వాహనాల భాగాలు కనిపిస్తున్నాయి. బీరుట్‌ ఓడరేవు కేంద్రంగా చోటు చేసుకున్న ఈ ఘటన.. కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాలపైనా ప్రభావం చూపింది. పెద్దఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. అయితే, బీరుట్‌ నౌకాశ్రయంలో టపాసులు నిల్వ చేసిన గొడౌన్‌లో పేలుడు సంభవించినట్లు స్థానిక ప్రసార మీడియా తెలిపింది. అంతర్యుద్ధం, ఆత్మాహుతి దాడులు బీరుట్‌కు కొత్త కాకపోయినా తాజా ఘటన మాత్రం ప్రజల్ని మరింత్ర భయభ్రాంతులకు గురిచేసింది. అణుబాంబు పేలినట్లుగా అనిపించిందని స్థానికులు తెలిపారు. తొలుత టపాసులు పేలుతున్నట్లు మొదలైన శబ్దం ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిందని వివరించారు. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి, ఆర్ధిక సంక్షోభంతో సతమతవుతున్న లెబనాన్‌కు.. పులిమీద పుట్రలా ఈ భారీ పేలుడు విరుచుకుపడింది. దీంతో, బాధితులకు సాయం అందించేందుకు డజన్ల కొద్దీ అంబులెన్సులు రంగంలో దిగాయి. రక్తదానం చేయాల్సిందిగా ఆసుపత్రులు అభ్యర్థించాయి. ‌లెబనాన్ జనరల్ సెక్యూరిటీ చీఫ్ అబ్బాస్ ఇబ్రహీం మాట్లాడుతూ.. కొంతకాలం కిందట ఓడ నుంచి దింపి, అక్కడ గొడౌన్‌లో నిల్వ ఉంచిన అత్యంత పేలుడు పదార్థాల వల్ల ఇది జరిగి ఉండవచ్చన్నారు. స్థానిక మీడియా ఒకటి ఇది సోడియం నైట్రేట్ అని తెలిపింది. నైట్రేట్లతో కూడిన పేలుడు తర్వాత విషపూరితమై నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు విడుదల అయినప్పుడు కనిపించే నారింజ రంగు మేఘాలను చూసినట్లు సాక్షులు తెలిపారు. లెబనాన్ దక్షిణ సరిహద్దులో ఇజ్రాయెల్, హిజ్బుల్లా సైనిక బృందం మధ్య ఉద్రిక్తతల కొనసాగుతున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించడానికి ముందు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శబ్దం వినిపించిందని చాలా మంది నివాసితులు పేర్కొన్నారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. పేలుడుతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని మీడియాతో చర్చించడానికి తనకు అధికారం లేనందున ఆయన తన పేరు వెల్లడించడానికి నిరాకరించారు.


By August 05, 2020 at 07:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/massive-beirut-blast-kills-more-than-70-injures-more-than-three-thousands/articleshow/77362720.cms

No comments