Breaking News

చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం.. 28 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెడుతున్న మోదీ


మరో చారిత్రక ఘట్టానికి అయోధ్య సాక్షీభూతంగా నిలవనుంది. మరి కొద్ది గంటల్లో జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాయజ్ఞ‌ం కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదగా జరగనుంది. ఈ నేపథ్యంలో రామాలయ నమూనాను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా.. అయోధ్యలో 28 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెడుతున్నారు. రామమందిర ఉద్యమంలో ఓ పాల్గొన్న ఆయన... తర్వాత తిరంగా యాత్రలో భాగంగా 1992 జనవరి 18న అయోధ్యకు వెళ్లారు. సరిగ్గా 28 ఏళ్ల కిందట అయోధ్యలో అడుగుపెట్టిన మోదీ.. రామ్ లల్లాను దర్శించుకున్నారు. అప్పుడు ఆయన అన్న మాటలే నిజమయ్యాయి. తాను ఆలయం నిర్మించే సమయంలో మరోసారి వస్తానని శపథం చేశారు. నాడు మోదీ చేసిన శపథం నెరవేరబోతోంది. రామాలయానికి ఆయన చేతులమీదుగానే భూమి పూజ జరగబోతుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయాలంటూ కన్యాకుమారి నుంచి నరేంద్ర మోదీ ‘తిరంగాయాత్ర’ను ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల మీదుగా యాత్రను కొనసాగించిన మోడీ.. జనవరి 18న ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఫైజాబాద్ సమీపంలోని ఓ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి హాజరయ్యారు. ఆ మర్నాడు జోషితో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్న మోదీ మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడి ఆలయం నిర్మించే సమయంలో మరోసారి అయోధ్య వస్తానని చెప్పినట్టు సీనియర్ జర్నలిస్ట్ మహేంద్ర త్రిపాఠి అన్నారు. అయోధ్యలో దాదాపు 3,500 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ కమాండోలు ఆలయ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు, కేవలం 175 మందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపగా.. వీరు మాత్రమే శంకుస్థాపనకు హాజరుకావాలని అధికారులు సూచించారు. కోవిడ్-19 కారణంగా ఈ కార్యక్రమానికి ఎక్కువ మందిని అనుమతించడంలేదని అయోధ్య జిల్లా ఎస్ఎస్పీ దీపక్ కుమార్ అన్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. 11.30 గంటలకు లక్నోకు చేరుకుంటారు. అక్కడ నుంచి అయోధ్యకు చేరుకుని, రామజన్మభూమి ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్‌గఢి వద్ద తొలుత ప్రార్ధనలు నిర్వహిస్తారు. భూమిపూజ కార్యక్రమం 12.30-12.45 గంటల మధ్య ముగియనుంది.


By August 05, 2020 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/back-in-ayodhya-after-28-years-pm-modi-to-lay-ram-mandir-foundation-stone-today/articleshow/77363027.cms

No comments