Breaking News

దేశంలో 20 లక్షల దాటిన కోవిడ్ బాధితులు.. నిన్న రికార్డ్‌స్థాయిలో 62వేల కేసులు


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,276,745 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాతో 41,655 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 50 లక్షలకుపైగా కేసులు, 1.67 లక్షల మరణాలతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. 28 లక్షల కేసులు, 98, 644 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 62,538 కొత్త కేసులు బయటపడ్డాయి. దాదాపు 900 మంది దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 20,27,075కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 41,655కి పెరిగింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 13,78,587 మంది కోలుకోగా.. మరో ఆరు లక్షల మందికిపైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,27,24,134 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులో 5,74,783 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. జులై 28 నాటికి ఇండియాలో కేసుల సంఖ్య 15 లక్షల దాటేయగా.. ఆ తరువాత కేవలం 9 రోజుల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. సగటున రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ 13.28 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశంలో మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌‌ప్రదేశ్‌ల్లో అత్యధికంగా కొత్త కేసులు వస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే 4.6 లక్షలకు పైగా కేసులుండటం గమనార్హం. గురువారం ఏపీలో 10,358 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో గురువారం 6,805 కరోనా కేసుల్ని గుర్తించారు. తమిళనాడులో గురువారం 5,684 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,79,144కు చేరాయి. తొలుత కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, ఆ తరువాత ఢిల్లీలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో దేశ రాజధానిలో 1,299 కేసులు మాత్రమే వచ్చాయి. 15 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.


By August 07, 2020 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-cross-20-lakh-mark-in-india-yesterday-report-massive-spike-in-new-cases/articleshow/77406981.cms

No comments