Breaking News

యూపీ: ఆగి ఉన్న కారును ఢీకొన్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి


ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 18 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కనౌజ్ సమీపంలోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు బీహార్‌లో దర్భాంగా నుంచి ఢిల్లీకి వెళుతుండగా కనౌజ్ వద్ద ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు సహా కారు రోడ్డు పక్కనే ఉన్న 20 అడుగుల గుంతలోకి పడిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవడంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్టు భావిస్తున్నారు. రహదారి పక్కన ఉన్న 20 అడుగుల గుంతలోకి దూసుకెళ్లిన బస్సును భారీ క్రేన్ సాయంతో తీస్తున్నారు. ప్రమాద సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కారులో కొందరు లూథియానాకు వెళ్తూ కనౌజ్ వద్ద నిలిపి, నిద్రపోతున్న సమయంలో బీహార్ నుంచి వస్తున్న బస్సు ఢీకొట్టింది. లాక్‌డౌన్ కారణంగా స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికులు.. తిరిగి పనుల కోసం ఢిల్లీకి వెళుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.


By July 19, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-tha-five-died-at-least-18-injured-bus-hit-another-vehicle-at-agra-in-up/articleshow/77046880.cms

No comments