Breaking News

కోవిడ్ రోగుల నుంచి అంబులెన్స్‌కు వసూలుచేసే ఛార్జీలతో విమానంలో ఐరోపాకు వెళ్లొచ్చు!


బాధితులను 10-15 కిలోమీటర్లు అంబులెన్స్‌ల్లో తీసుకెళ్లడానికి వేలల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్ మినహా కొన్ని రాష్ట్రాలు వీటిని నియంత్రించడానికి చర్యలు చేపట్టాయి. చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినా.. నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ముంబైలో 10-15 కిలోమీటర్ల దూరానికే రూ.30,000, పుణేలో 7 కిలోమీటర్లకు రూ .8,000 వసూలు చేసినట్టు వెలుగులోకి రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. తన తల్లిని ఇంటి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించడానికి రూ.15,000 వసూలు చేశారని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రయివేట్ సర్వీసులు డ్రైవర్, సహాయకుడి పీపీఈ కిట్ల కోసం రూ.3,000 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన బంధువును నిజామాపేట్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాడానికి అంబులెన్స్‌కు రూ.11,000 చెల్లించాడు. అయితే, ఇందులో మెకానికల్ వెంటిలేషన్ సౌకర్యం కూడా లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సుల ప్రకారం ప్రతి లక్ష మందికి కనీసం ఒక అంబులెన్స్ ఉండాలి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ సిఫార్సులకు దగ్గరగానే అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు, ప్రయివేట్ అంబులెన్స్ సర్వీసులను లెక్కిస్తే ఈ సంఖ్య 50వేల మందికి ఒక్కటి కంటే ఎక్కువే ఉంటుంది. పుణేలోని ప్రతి 31,000 మందికి ఒకటి, చండీగఢ్‌లో ప్రతి 33వేల మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు నగరానికి వస్తే 1.40 లక్షల మందికి ఒక అంబులెన్స్ చొప్పున ఉండటం వల్ల ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 71 ప్రభుత్వ అంబులెన్స్‌ల్లో 23 మాత్రమే కోవిడ్ రోగులను తరలించడానికి వినియోగిస్తున్నారు. అంబులెన్స్ సకాలంలో రాక కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని రాష్ట్రాల్లోనూ అంబులెన్స్ ఆపరేటర్లు భారీగా రేట్లు పెంచారు. ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19కు ముందు కిలోమీటర్‌కు రూ.10 వసూలుచేయగా.. ప్రస్తుతం అది రూ.13 గా ఉంది. మారుతీ వ్యాన్ అంబులెన్స్‌కు రూ.500 వసూలు చేయగా.. ఇది రూ.900కి చేరింది. బీహార్‌లో ప్రయివేట్ అంబులెన్స్‌లు కనీసం ఐదు నుంచి పది రెట్లు మేర ఛార్జీలు పెంచడం గమనార్హం.


By July 20, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-in-india-few-checks-in-place-ambulances-fleece-desperate-covid-patients/articleshow/77060386.cms

No comments