Breaking News

యూపీ: కొవ్వొత్తుల కంపెనీలో ప్రమాదం.. ఎనిమిది మంది మృతి


కొవ్వొత్తుల తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలోని మోదీ నగర్ సమీపంలో ఉన్న బఖర్వా గ్రామంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, 16 ఏళ్ల బాలుడు ఉన్నారు. మోదీ నగర్‌ యూనిట్‌లోని అత్యంత ప్రమాదకర పరికరాలకు మంటలంటుకుని ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రమాదం గురించి నివేదిక అందజేయాలని ఘాజియాబాద్ కలెక్టర్ అజయ్ శంకర్ పాండే, ఎస్పీ కళానిధి నైథానీని ఆదేశించారు. మరోవైపు, కొవొత్తుల ఫ్యాక్టరీకి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. అయితే, విధుల్లో అలసత్వం వహించినందుకు ఆ ప్రాంతంలోని పోలీస్ పోస్ట్ ఇంఛార్జిని విధుల నుంచి తప్పించారు. ఫ్యాక్టరీలో మెరిసే పుట్టినరోజు కొవ్వొత్తులను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి ఉపయోగించిన పేలుడు పదార్థాలకు మంటలు అంటుకున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. ప్రమాదం జరిగిన సమయానికి 12 మందికిపైగా ఫ్యాక్టరీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మంటలు అంటుకోవడంతో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పైకప్పు కూలిపోయింది. ఈ భవనం అద్దెకు తీసుకుని ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీని అక్రమంగా నడుపుతున్నారని ఘాజియాబాద్ ఎస్పీ అన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో వినియోగించే కొవ్వొత్తులను ఇక్కడ తయారుచేస్తున్నారని, ఇవి సాధారణంగా స్వల్పంగా పేలుడు సామర్థ్యం కలిగి ఉంటాయని తెలిపారు. కాగా, ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి రూ.50వేల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.


By July 06, 2020 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/eight-killed-in-fire-at-candle-making-factory-in-modi-nagar-in-uttar-pradesh/articleshow/76805751.cms

No comments