Breaking News

సరిహద్దుల్లో పర్యటన.. లేహ్‌లో తుపాకి పట్టిన రాజ్‌నాథ్


గత రెండు నెలలుగా భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇరు దేశాలూ తొలి దశలో వివిధ ప్రాంతాల నుంచి తమ సైన్యాలను వెనక్కు మళ్లించాయి. మిగతా ప్రాంతాల్లో బలగాల తరలింపుపై మూడు రోజుల కిందట భారత్, చైనా సైనికాధికారుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితిని సమీక్షించడానికి రెండు రోజుల పర్యటనకు రక్షణ శాఖ మంత్రి శుక్రవారం ఉదయం లడఖ్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి లేహ్‌‌కు చేరుకున్న రాజ్‌నాథ్‌కు సైనిక, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. నేడు, రేపు సరిహద్దుల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడ నుంచి శనివారం మధ్యాహ్నం శ్రీనగర్‌‌కు వెళ్లనున్న రాజ్‌నాథ్‌సింగ్‌ పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. స్టాక్నా సైనిక స్థావరంలో పర్యటించిన రాజ్‌నాథ్.. అక్కడ నిర్వహించిన సైనిక విన్యాసాలన ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు, ఆయుధాలను వినియోగించే విధానాన్ని కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యుద్ధ ట్యాంకులు, శతఘ్నుల సన్నద్ధత, ఏకే 47 చేత్తో పట్టుకుని, దాని పనితీరును రాజ్‌నాథ్ పరిశీలించారు. రాజ్‌నాథ్‌ వెంట సీడీఎస్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తదితరులు ఉన్నారు. చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దుల్లోనూ వివాదాలు లు తీవ్రమవుతున్న నేపథ్యంలో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు రాజ్‌నాథ్ నేరుగా ఫీల్డ్ కమాండర్స్‌తో సమావేశం కానున్నట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.


By July 17, 2020 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/defence-minister-rajnath-singh-witnessing-para-dropping-and-scoping-weapons-at-stakna-leh-/articleshow/77011844.cms

No comments