Breaking News

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులను సైన్యం హతమార్చింది. కుల్గాంలోని నాగ్‌నాద్-చిమ్మేర్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కూడా సాగుతోందని పోలీసులు వివరించారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, వీరిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించామన్నారు. పుల్వామా జిల్లా అవంతిపొరలో లష్కరే తొయిబా ఉగ్రవాదులకు సహకరిస్తున్న షాహిల్ ఫరూక్ మిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, లాజిస్టిక్ సహా ఇతర సహకారాలు అందజేయడమే కాదు, త్రాల్, కాక్‌పొర, ఖ్రే, అవంతిపొరలో ముష్కర మూకలకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన సమయంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత రెండు నెలలుగా వివిధ ఎన్‌కౌంటర్‌లలో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లో రెండు రోజుల కిందట జైషే మొహమూద్ ఉగ్రవాదులు ఇద్దర్ని కాల్చి చంపారు.


By July 17, 2020 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-killed-in-kulgam-encounter-in-kashmir-operation-underway/articleshow/77011563.cms

No comments