Breaking News

రాజస్థాన్ ప్రతిష్టంభన: గెహ్లాట్ ప్రతిపాదనకు గవర్నర్ ఎట్టకేలకు ఆమోదం.. ఆగస్టు 14న అసెంబ్లీ!


రాజస్థాన్‌ కాంగ్రెస్ ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం దాదాపు కొలిక్కి వచ్చింది. అసెంబ్లీని సమావేశపరచాలని నాలుగోసారి రాజస్థాన్ క్యాబినెట్ పంపిన తీర్మానానికి గవర్నర్ ఎట్టకేలకు ఆమోద ముద్ర వేశారు. అసెంబ్లీ సాధారణ సమావేశాలకు 21 రోజుల గడువు ఉండాలన్న గవర్నర్ సూచనలకు అనుగుణంగా ఆగస్టు 14న అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతూ మంత్రి మండలి బుధవారం రాత్రి తీర్మానం పంపింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఆమోదం తెలిపారు. అసెంబ్లీ సమావేశం గురించి క్యాబినెట్ పంపిన నాలుగో సిఫార్సు ఇది. బుధవారం రాత్రి ప్రతిపాదన అందిన 2 గంటల తర్వాత రాజ్‌భవన్‌ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు కేబినెట్‌ చేసిన మూడు తీర్మానాలను గవర్నర్‌ తిరస్కరించారు. శాసనసభను సమావేశపరచాలని కోరుతూ మంగళవారం పంపిన మూడో ప్రతిపాదననూ కల్‌రాజ్‌ మిశ్రా తిరస్కరించడంతో క్యాబినెట్ బుధవారం మరోసారి భేటీ అయ్యింది. గవర్నర్‌ సూచనకు అనుగుణంగా, గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఆగస్టు 14న సమావేశపరచాలని మంత్రిమండలి ప్రతిపాదించింది. తక్షణమే శాసనసభ సమావేశం ఏర్పాటుచేయడానికి గల కారణాన్ని మూడోసారి చేసిన ప్రతిపాదనలో పేర్కొనలేదంటూ బుధవారం గవర్నర్‌ అభ్యంతరం తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత స్పీకర్ సీపీ జోషి కూడా గవర్నర్‌ను కలిసి అసెంబ్లీని సమావేశపరచాలని కోరారు. మరోవైపు, అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మరోసారి సుప్రీంకోర్టులో స్పీకర్ సవాల్‌చేశారు. స్పీకర్‌ అధికారాల్లో హైకోర్టు జోక్యం చేసుకుంటోందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘జులై 23 న మా మొదటి ప్రతిపాదనను పంపించాం. దీనిని ప్రారంభ తేదీగా భావించి, ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశ పరచడానికి అవసరమైన వ్యవధిని ఇప్పుడు ప్రతిపాదించాం’ అని శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధారీవాల్ అన్నారు.


By July 30, 2020 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-crisis-ashok-gehlot-blinks-governor-has-his-way-on-21-day-notice/articleshow/77253614.cms

No comments