Breaking News

సరిహద్దు ఘర్షణ: ఓవైపు చర్చలు జరుపుతూనే చైనా కదలికలపై డేగ కళ్లతో నిఘా


తూర్పు లడఖ్‌లో చైనా చొరబాట్లు, సైనిక నిర్మాణాల వల్ల కొనసాగుతున్న ఉద్రిక్తతలను పరిష్కరించడానికి దౌత్యపరంగా భారత్, చైనాలు చర్చలు కొనసాగుతున్నాయని, జూన్ 6న సీనియర్ కమాండర్ల మధ్య కుదిరిన అవగాహన అమలు చేస్తామని ఇరు దేశాలూ అంగీకరించాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, ఓవైపు చైనాతో దౌత్యపరంగా చర్చలు జరుపుతూనే దాని కదలికలపై డేగ కళ్లతో భారత్ నిఘా ఉంచిందని పేర్కొంది. భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య భేటీ జరిగినా.. చైనా వైఖరి పట్ల భారత్ అప్రమత్తంగానే ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత సంక్షోభం డోక్లాం కంటే తీవ్రమైనదిగా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో మే నెలకు ముదున్న యథాతథ స్థితిని కొనసాగించాలని భారత్ కోరుతుంటే.. చైనా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అయితే దౌత్య స్థాయిలో వాస్తవాధీన రేఖ ప్రాముఖ్యతను గౌరవించాలని ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి. డబ్ల్యూఎంసీసీలో భాగంగా భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఇరుపక్షాలు ఘర్షణలను తగ్గించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు విదేశాంగ శాఖ ప్రకటన మరింత సంయమనం పాటించేలా ఉంది. అంతకు ముందు, గాల్వన్ లోయపై చైనా వాదనలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తిప్పికొట్టారు. ఇది ‘చారిత్రాత్మకంగా స్పష్టంగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వాస్తవాధీన రేఖకు సంబంధించి అతిశయోక్తి, సాధ్యంకాని వాదనలను ముందుకు తీసుకురావడానికి చైనా చేసిన ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.


By June 25, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-standoff-diplomatic-talks-on-but-government-sceptical-of-china/articleshow/76616064.cms

No comments